Pocharam Srinivas Reddy Joins Congress Party: తెలంగాణ మాజీ స్పీకర్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు దిగి హస్తం గూటిలోకి చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.
భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పోచారం చేరిక గురించి క్లారిటీ ఇచ్చారు. పోచారంకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం తెలిపారు. రైతు సంక్షేమం విషయమై పోచారం సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఆయన అనుభవం ఉపయోగపడుతుందని అన్నారు.
రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరో 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై పోచారం గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం.. బాన్స్వాడ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుభవం పాలన వ్యవహారాల్లో ఉపయోగపడుతోందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ హయాంలో మంత్రిగా వ్వవహరించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఇప్పటివరకు బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్(భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్ ఘనపూర్), దానం నాగేందర్(ఖైరతాబాద్) కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని దానం నాగేందర్ చెప్పారు. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరు మిగలరని అన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీని ముంచాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ హస్తం గూటికి చేరుకుంటుందని తెలిపారు. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పేర్కొన్నారు దానం నాగేందర్.