CM Revanth Reddy Laid Foundation for ATC at ITI: ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్(ఏటీసీ)గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో పదేళ్ల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏటీసీలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని మల్లెపల్లి ఐటీఐలో శంకుస్థాపన చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేస్తారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటీసీలలో యువతకు శిక్షణ అందించనున్నారు.
శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణలలను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ నియమిస్తుంది. ఏటీసీలలో ప్రతి ఏటా 15,860 మందికి ఆరు రకాల దీర్ఘకాలకోర్సులలో 31,200 మందికి 23 రకాల స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ అందిస్తారు. రానున్న పదేళ్లలో నాలుగు లక్షలమంది శిక్షణ పొందనున్నట్లు వెల్లడించారు.
Also Read: ఆర్టీసీ బస్సులో మరోసారి ప్రయాణించిన మంత్రి సీత
అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా పరిగణిస్తుందని, ఈ సెంటర్ల ద్వారా జరిగే కార్యక్రమాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా సమీక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఉద్యోగం, ఉపాధి లభించాలంటే పట్టా ఉంటే సరిపోదని, సాంకేతిక నైపుణ్యం ఉండాలని చెప్పారు.
విద్యాబోధనలో 40,50 ఏళ్ల క్రితం ఉన్న విధానాలు అనుసరిస్తున్నామని, దీంతో మన చదువులు అవుటాఫ్ సిలబస్గా మారిపోయాయన్నారు. అందుకే ప్రతి ఏటీసీలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చమని, అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని సెంటర్లు అందుబాటులోకి వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.