Congress Leader Sam Pitroda reacts on EVMs Debate: ఎన్నికల పోలింగ్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎం) హ్యాకింగ్ కు గురవుతాయంటూ ప్రముఖ టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇదే అంశంపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈవీఎం మిషన్లను హ్యాక్ చేయడానికి, ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశం ఉందంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్ వేర్, కాంప్లెక్స్ సిస్టం వంటి రంగాలపై అరవై ఏళ్లపాటు నేను పనిచేశాను. ఈ క్రమంలో ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశా. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం అవుతుంది. హ్యాక్ చేయడం వల్ల ఫలితాలు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెట్ ఓటింగ్ విధానమే చాలా ఉత్తమమైనది. ఓట్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగవు. అందువల్ల బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి’ అంటూ ఆయన పేర్కొన్నారు.
‘ఈవీఎం మిషన్లతోపాటు, వీవీప్యాట్ స్లిప్స్ కోసం వీవీప్యాట్ యంత్రాలు కూడా అమర్చబడి ఉన్నాయి. అయితే, వీవీప్యాట్ యంత్రాల సాయంతో కూడా వాటిని హ్యాక్ చేయడానికి అవకాశం ఉందని స్పష్టంగా అర్థమైతుంది’ అని శ్యామ్ పిట్రోడా అన్నారు.
‘ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్, ఓటర్ల జాబితా, పోలైన ఓట్ల, లెక్కించిన ఓట్లు, మొత్తం ఓట్లు, విజతేలకు వచ్చిన ఓట్లు, ఓడిపోయినవారి ఓట్లు వంటివాటిపై పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. వీటిన్నిటినీ కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలి’ అని ఆయన సూచించారు.
Also Read: సీఎం కీలక నిర్ణయం.. ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ..
ఇదిలా ఉంటే.. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి ఏ మాత్రం వీలు లేదని తెలిపింది. భారత్ లో ఉపయోగించే ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్ నెట్ వంటి వైర్ లెస్, వైర్ కనెక్షన్లు ఉండవని స్పష్టం చేసింది. అందువల్ల ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు అవకాశమే లేదంటూ పేర్కొన్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు అవకాశం ఉందంటూ వస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది.