Mamata Banerjee Hot Comments on Union Government: బెంగాల్లో సోమవారం ఉదయం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సిల్చార్ నుంచి సీల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను వెనుకనుంచి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటన బెంగాల్లోని రంగపాని రైల్వే స్టేషన్కు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మరణించగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా దీదీ రైల్వే మంత్రిత్వ శాఖపై నిప్పులు చెరిగారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికుల సౌకర్యాలను పట్టించుకోదని అన్నారు. ప్రయాణికుల సంగతి అటుంచితే కనీసం రైల్వే అధికారులు, రైల్వే ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, కార్మికుల గోడు పట్టించుకోరని పేర్కొన్నారు.
రైల్వే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు మమతా బెనర్జీ. వారి పాత పెన్షన్ విధానం రద్దు చేశారని గుర్తుచేశారు. బీజేపీ కేవలం ఎన్నికలను మాత్రమే పట్టించుకుంటుందని.. హ్యాకింగ్ ఎలా చేయాలి, మానిప్యులేషన్కు ఎలా వెళ్లాలి, రిగ్గింగ్ ఎలా చెయ్యాలి అని మాత్రమే ఆలోచిస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు చాలా పనులు ప్రారంభించానని తెలిపారు. కానీ బీజేపీ ప్రభుత్వం వందేభారత్ రైళ్ల ప్రచారాన్ని మాత్రమే చేస్తున్నారన్నారు. దురంతో ఎక్స్ప్రెస్ పరిస్థితి ఏంటి.. అసలు ఇప్పడు ఎక్కడ ఉంది.. రాజధాని ఎక్స్ప్రెస్ సంగతేంటి అని ప్రశ్నించారు. నేడు మొత్తం రైల్వే శాఖ నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.
Also Read: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ..గాల్లోకి లేచిన బోగీలు
ప్రమాదం గురించి తనకు ఉదయం 9 గంటలకు సమాచారం వచ్చిందని మమతా బెనర్జీ తెలిపారు. అప్పటి నుంచి బెంగాల్ సీఎస్, ఇతర అధికారుల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని అన్నారు. గాయపడిన వారికి సహాయం చేయడానికి, పునరుద్ధరణ పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నాని పేర్కొన్నారు.