BRS Power Purchase Agreement Notices(Telangana news live): విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేసీఆర్కు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు ఒప్పంద నిర్ణయాలపై వివరణ ఇవ్వాలంటూ ఈ నెల 11న కేసీఆర్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ్టిలోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. కాగా.. ఇప్పటివరకు కేసీఆర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జులై 30 వరకు కేసీఆర్ సమయం కోరగా.. అందుకు కమిషన్ అంగీకరించలేదు.
తాజాగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు 24 గంటల విద్యుత్ అందించాలని ఆ లేఖలో కేసీఆర్ వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సరఫరా విషయంలో గణనీయమైన మార్పుల్ని చూపించామన్నారు. కానీ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కమిషన్ చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని లేఖలో వాపోయారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తమను అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంతోనే కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేసీఆర్ కోరారు.
విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జూన్ 15 లోగా సమాధానమివ్వాలని అనుకున్నా అని, కానీ దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని అర్థమైందన్నారు. కమిషన్ విచారణ పారదర్శకంగా జరగడం లేదని వాపోయారు. అందుకే విచారణ పూర్తికాకుండానే ప్రెస్ మీట్ పెట్టి.. తన పేరును ప్రస్తావించారని, తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్నదే కమిషన్ ఉద్దేశమైనపుడు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని అర్థమైందన్నారు. విద్యుత్ సరఫరా ఇప్పుడెలా ఉందో.. 2014కు ముందెలా ఉండేదో ఆయనకు బాగా తెలుసన్నారు. కానీ.. ఆయన విచారణ తీరు సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్ను నియమించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు హైకోర్టు నోటీసులు!
తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఈ అంశంపై విచారణకు ఆదేశించి.. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను నియమించింది. ఇందులో ఉన్న లోటుపాట్లను తేల్చాలని ఆదేశించింది.
మాజీ సీఎం కేసీఆర్.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో తన ప్రమేయం ఎంతమేరకు ఉందన్న దానిపై వివరణ ఇవ్వాలని కోరుతూ.. జూన్ 15 వరకూ సమయం ఇచ్చింది. అయితే తనకు జులై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరారు. ఆ విజ్ఞప్తిని కమిషన్ తిరస్కరించింది. గత ప్రభుత్వ హయాంలో పీపీఏలలో జరిగిన అవకతవకలపై కమిషన్ దృష్టిసారించింది. అలాగే ఛత్తీస్ గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు అంశంపై కూడా విచారణ జరుగుతోంది. నేడు కేసీఆర్ స్పందించకపోయినా, స్పందన సంతృప్తిగా లేకపోయినా.. వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది.