Monsoon Health Tips: వర్షాకాలం వచ్చిందంటే ఆ అనుభూతి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బయట వర్షం పడుతూ ఉంటే చల్లటి వాతావరణంలో ఏదో ఒకటి తినాలని చాలా కోరికలు పుడుతుంటాయి. వేడిగా టీ, కాఫీ, లేదా సమోసా, మిర్చీ, బజ్జీలు తినాలని అనిపిస్తుంది. అయితే సీజన్ను బట్టి ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో పలు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో తినే కొన్ని ఆహార పదార్థాలు అనారోగ్యానికి దారితీస్తాయని అంటున్నారు. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆకు కూరలు
వర్షాకాలంలో లభించే ఆకుకూరలు అస్సలు తినకూడదు. ఎందుకంటే తేమ కారణంగా ఆకుకూరల్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఏర్పడుతాయి. దీంతో ఆకుకూరలపై తెగుళ్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వానాకాలంలో ఆకుకూరలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పాలకూర, మొంతికూరలు అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2. చేపలు, రొయ్యలు
సీఫుడ్ తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో ఎక్కువ శాతం నీరు కలుషితం అవుతుంది. అందువల్ల నీటిలో పెరిగే చేపలు, రొయ్యలు వంటివి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వంటివి త్వరగా వ్యాపిస్తాయి. అందువల్ల సీఫుడ్ తీసుకునే వారు ఈ సీజన్లో దూరంగా ఉండడం మంచిది.
3. మసాలా ఫుడ్
వానాకాలంలో ఎక్కువగా మసాలా ఫుడ్ తినాలనే కోరిక పుడుతుంది. వేడివేడిగా పకోడీలు, మిర్చీలు, ఫాస్ట్ ఫుడ్ తినాలి అనిపించినా తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటి వల్ల మలబద్ధకం, విరేచనాలు, అజీర్తి వంటి కడుపు సంబంధింత సమస్యలు ఏర్పడుతాయి.
4. మష్రూమ్
ఫంగస్ జాతికి చెందిన పుట్టగొడుగులు నేలలో పెరుగుతాయి. వర్షాకాలంలో నేలలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది కాబట్టి పుట్టగొడుగులను అస్సలు తినకూడదు.