YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని చూసిన అనంతరం.. జగన్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మంగళవారం ఉదయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీడీపీ హవానే కొనసాగింది. ఒకస్థాయిలో వైసీపీ సింగిల్ డిజిట్ లో మాత్రమే లీడింగ్ లో కనిపించింది. ఓటమిని అంగీకరించిన జగన్.. రాజీనామాకు సిద్ధమై మధ్యాహ్నమే గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్ మెంట్ కోరారు. అనంతరం జగన్ తన రాజీనామాను గవర్నర్ కు అందించారు.
కాగా.. 2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ.. ఈసారి కేవలం 10 సీట్లకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది సింగిల్ డిజిట్ కే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని చూసిన జగన్.. మీడియా ఎదుట తమ ఓటమికి కారణమేంటో తెలియడం లేదని వాపోయారు.
ప్రజలకు తాను అంతా మంచే చేశానని, విద్యార్థులు, రైతులు, మహిళలు, అవ్వాతాతలు, దివ్యాంగుల కోసం ఎంత చేసినా ఆ ఫలితం ఎన్నికల్లో ఎందుకు కనిపించలేదో తెలియలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షల మంది అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో ఆ దేవుడికే తెలియాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజలకోసం పోరాడుతామని చెప్పుకొచ్చారు.