Pakistani Influencer Riding A Tiger: బోనులో ఉన్న పెద్ద పులిని చూస్తేనే ఒకరకమైన భయం పుడుతుంది. దాని గాండ్రింపు వింటే గజ్జున వణికిపోతాం. కానీ, ఓ పాకిస్తానీ వ్యక్తి ఏకంగా పులి మీద స్వారీ చేశాడు. వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈవీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పులిపై స్వారీ చేసిన డిజిటల్ క్రియేటర్ నౌమన్
పాకిస్తాన్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా నౌమన్ హసన్ బాగా పాపులర్. ఆయన రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. పులికి గొలుసు కట్టి కాసేపు నడిపించిన ఆయన, నెమ్మది దానిపై ఎక్కి కూర్చున్నాడు. కొద్ది దూరం పాటు పులిపై స్వారీ చేశాడు. ఎక్కువ సేపు ఆయన పులిపై కూర్చోలేకపోయారు. బ్యాలెన్స్ ఆపలేక కిందికి జారిపోయాడు. అటు పులి పక్కనే బోనులో రెండు సింహాలు కూడా కనిపించాయి.
View this post on Instagram
సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియోను హసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపట్లో బాగా వైరల్ అయ్యింది. ఏకంగా లక్షకు పైగా వ్యూస్ సాధించింది. హసన్ పులి మీద స్వారీ చేయడం పట్ల పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్రూర మృగాల విషయంలో మజాక్ చేస్తే, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఆ పులిని చూస్తుంటే ఆరోగ్యం బాగాలేదు అనిపిస్తోంది. అనారోగ్యంగా ఉన్న జంతువుతో ఆటలాడటం మంచిది కాదు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “పులి విషయంలో హసన్ చాలా క్రూరంగా వ్యహరిస్తున్నాడు” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “క్రూర మృగాలు ఉండాల్సింది అడవిలో, ప్రైవేటు స్థలంలో కాదు” అంటూ ఇంకో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ‘అటవీ జంతువుల విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురావాలి” మరికొంత మంది కోరుతున్నారు. మొత్తంగా హసన్ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
పాకిస్తాన్ లో పెంపుడు జంతువులుగా పులులు
పాకిస్తాన్ లో వన్యప్రాణుల విషయంలో కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ, చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. సుమారు 100కు పైగా పులులను కొంత మంది బాడా బాబులు పెంపుడు జంతువులగా ఇంట్లో ఉంచుకున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ జంతువులను పొరుగు దేశాల నుంచి అక్రమంగా దేశంలోకి తెచ్చుకుని పెంచుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా వరకు వాటిని ఇంట్లోనే వదిలేస్తారు. కొన్నింటిని బోనులో ఉంచుతారు. తాజాగా హసన్ వీడియో బయటకు రావడంతో, అటవీ జంతువుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. క్రూర మృగాలు ఇళ్లలో పెరగడం ఎప్పటికీ మంచిది కాదంటున్నారు. పులులను పెంచుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే అంటున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం వన్యప్రాణుల విషయంలో కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also:మస్క్ మామ బంపర్ ఆఫర్.. అలా చేస్తే రూ.4 వేలు ఇస్తాడట, చంపేద్దాం అనుకుంటున్నాడా?