Chandanki Community Kitchen: గుజరాత్ లోని మెహసానా జిల్లా చెచార్ జీ తాలూకా పరిధిలో ఉన్న చందంకి గ్రామం ఇప్పుడు వరల్డ్ ఫేమస్. దానికి కారణం ఈ ఊరి ప్రజల భోజన విధానం. ఈ ఊరి ప్రజలు ఎవరూ తమ ఇంట్లో వంట చేయరు. గ్రామ ప్రజలందరికీ కోసం ఒకే చోట భోజనం చేస్తారు. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. గ్రామ ప్రజలంతా రెండుపూటలా రుచికరమైన ఆహారం ఇక్కడే తింటారు. కమ్యూనిటీ కిచెన్ లేదంటే కమ్యూనిటీ డైనింగ్ పేర్లతో పిలిచే ఈ పద్దతి ఇప్పుడు ఈ ఊరి పేరును ప్రపంచ వ్యాప్తంగా మార్మోగేలా చేస్తోంది.
కమ్యూనిటీ కిచెన్ ఆలోచన ఎలా వచ్చింది?
ఒకప్పుడు ఈ ఊరిలో 1,100 మంది జనాభా ఉండేది. చాలా కుటుంబాలు ఆర్థికంగా ఉన్నవే. వారి పిల్లల్లో చాలా మంది ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారు. తల్లిదండ్రులు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఈ ఊరిలో 500 మంది వృద్ధులు జీవిస్తున్నారు. ప్రతి నెల తమ తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తున్నా, దగ్గరుండి వారి బాగోగులు చూసుకోలేకపోతున్నారు. కనీసం వృద్ధులు పట్టణానికి వెళ్లి సరుకులు కొనితెచ్చి వంట చేసుకుని తినలేక ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో సొంతూరిలో అడుగు పెట్టారు పూనమ్ భాయ్ పటేల్. సుమారు 20 ఏళ్లుగా అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నారు. తిరిగి సొంతూరికి వచ్చే సరికి ఊళ్లో యువకులు ఎవరూ కనిపించలేదు. ఏంటి ఇంటి ముందు చూసినా వృద్ధులే కనిపించారు. ఎలాగైనా వారు ఇబ్బంది లేకుండా కడుపు నిండా భోజనం చేసేలా చూడాలనుకున్నారు. కమ్యూనిటీ కిచెన్ కు శ్రీకారం చుట్టారు.
కమ్యూనిటీ కిచెన్ ప్రత్యేకత ఏంటి?
గ్రామాస్తులు అందరికీ ఒకే చోట భోజనం తయారు చేయించడమే కమ్యూనిటీ కిచెన్ ప్రత్యేకత. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. రోజూ రెండు పూటల భోజనం ఒకే చోట్ వంటి అందరికీ ఇక్కడే పెడతారని వివరించారు. ఇందుకు గాను, ప్రతి వృద్ధుడు నెలకు కమ్యూనిటీ కిచెన్ కు రూ. 2 వేలు చెల్లించాలన్నారు. పూనమ్ భాయ్ పటేల్ ఆలోచనకు గ్రామస్తులు అంతా మద్దతు పలికారు. కొద్ది రోజుల్లోనే కమ్యూనిటీ కిచెన్ రెడీ అయ్యింది. రోజూ రెండు పూటల గ్రామస్తులంతా ఇక్కడే భోజనం చేయడం మొదలు పెట్టారు. కమ్యూనిటీ కిచెన్ ఆ ఊరి ప్రజల వంట కష్టాలను తీర్చింది. అంతేకాదు, అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులు అందరూ కలిసి పూనమ్ భాయ్ పటేల్ ను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు.
ఇంట్లో వంటలు మాయం.. ఒంటరితనం దూరం..
పూనమ్ భాయ్ పటేల్ తీసుకొచ్చిన కమ్యూనిటీ కిచెన్ విధానం చందంకిలోని వృద్ధులకు కడుపు నిండా భోజనం పెడుతోంది. సోలార్ పవర్ తో కూడిన ఏసీ డైనింగ్ హాల్ లో సంప్రదాయ గుజరాతీ వంటకాలతో పాటు సమతుల ఆహారం తీసుకుంటున్నారు. పూనమ్ భాయ్ రాక ముందు ఇండ్ల ముందు ఒంటరిగా జీవచ్చవాలుగా గడిపిన వృద్ధులు ఇప్పడు అందరూ ఒకే చోట భోజనాలు చేస్తూ చక్కగా సమయాన్ని గడుపుతున్నారు. ఒంటరి తనం మాయం అయ్యింది. కలివిడిగా ఉంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కమ్యూనిటీ కిచెన్ వైరల్ కావడంతో చాలా మంది ఈ గ్రామాన్ని సందర్శించి అక్కడ భోజనం చేసి, పూనమ్ భాయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also:ఆటో డ్రైవర్ ఎంత అప్డేట్ అయ్యాడు గురూ.. పేమెంట్స్ కోసం వినూత్న ఆలోచన