Fake Judge Arrested: మోసగాళ్లు రోజు రోజుకు మితి మీరి పోతున్నారు. సరికొత్త మోసాలతో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఫేక్ టోల్ ప్లాజా, ఫేక్ బ్యాంకు, ఫేక్ పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేసి జనాలకు షాక్ ఇచ్చారు. తాజాగా ఈ లిస్టులో ఫేక్ కోర్టు చేరింది. గుజరాత్లో ఓ వ్యక్తి ఏకంగా నకిలీ కోర్టునే ఏర్పాటు చేశాడు. జడ్జి అవతారం ఎత్తి ఏకంగా తీర్పులు ఇచ్చేస్తున్నాడు. తాజాగా ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.
5 ఏండ్లుగా నకిలీ కోర్టు నడుతున్న శామ్యూల్
గాంధీ నగర్ కు చెందిన మోరిస్ శామ్యూల్ మీద 2015లో ఓ చీటింగ్ కేసు నమోదయ్యింది. భూమి అమ్మకానికి సంబంధించి ఓ వ్యక్తిని మోసం చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. కొద్ది రోజులు కోర్టు చుట్టూ తిరిగి ఇష్యూ సెటిల్ చేసుకున్నాడు. సుమారు 2 సంవత్సరాల పాటు ఈ కేసు కోర్టులో నడిచింది. కోర్టుకు వెళ్లీ వెళ్లీ.. తాను కూడా జడ్జి కావాలనే కోరిక పుట్టినట్లుంది. 2019లో ఏకంగా ఓ నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు. ఆయనే జడ్జి అవతారం ఎత్తాడు. తనతో పాటు కొంత మందిని సిబ్బందిని నియమించుకున్నాడు. ఎవరైనా అక్కడికి వెళ్తే నిజంగానే కోర్టులా కనిపించేలా ఏర్పాట్లు చేశాడు.
ఓ వ్యక్తికి అనుకూలంగా 11 తీర్పులు
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కోర్టు మాదిరిగానే ఐదేళ్లుగా శామ్యూల్ కోర్టును నడుపుతూ ప్రజలను మోసం చేస్తూ వచ్చాడు. తన కోర్టులో మోరిస్ ప్రజల కేసులకు సంబంధించిన వాదనలు విని.. ఆపై ట్రిబ్యునల్ అధికారిగా ఉత్తర్వులు జారీ చేసేవాడు. విచారణ సమయంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అతడితో అక్కడ నిలబడి ఉండేవారు. దీంతో ప్రజలు నిజంగానే కోర్టు అని నమ్మేవారు. ఇప్పటి వరకు తన క్లయింట్ అయిన ఓ వ్యక్తికి 11 కేసుల్లో అనుకూలంగా తీర్పులు ఇచ్చాడు. ఇందుకు ప్రతి ఫలంగా ఆ వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూళు చేసేవాడు. సివిల్ జడ్జిని అని చెప్పుకుంటూ ఏకంగా టీవీ డిబేట్లలో కూడా పాల్గొన్నాడు ఈ మహానుభావుడు.
Gujarat Model
Fake court busted in Ahmedabad. FIR registered against a man for running a fake arbitration tribunal and passing several orders between 2019 and 2024.
ఐదేండ్లుగా ఏం చేస్తున్నార్రా అందరూ?
పైగా టీవీ డిబేట్లకు కూడా అ జడ్జి గారిని ఆహ్వానించారంట! pic.twitter.com/l24j2Jg0sf— VIDYUTH (@VIDYUTH_V) October 23, 2024
శామ్యూల్ మోసం ఎలా బయటపడిందంటే?
అహ్మదాబాద్ లోని భదర్ లోని సిటీ సివిల్, సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ హార్ధిక్ దేశాయ్ కారణంగా నకిలీ కోర్టు, నకిలీ జడ్జి వ్యవహారం బయటపడింది. 2019లో ప్రభుత్వ భూమికి సంబంధించి తన క్లయింట్ కు శ్యామూల్ అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ తరువాత ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో తన క్లయింట్ పేరు మీదికి మార్చాలని కలెక్టర్ ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. అంతటితో ఆగకుండా, ఈ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ శామ్యూల్ వేరే లాయర్ ద్వారా సిటీ సివిల్ కోర్టులో అప్పీల్ చేశాడు. ఈ పిటీషన్ కు ఆయన జారీ చేసిన నకిలీ ఉత్తర్వులను కూడా జత చేశాడు. ఆ ఉత్తర్వులు పరిశీలించిన కోర్టు రిజిస్ట్రారు అవి నకిలీవని గుర్తించడంతో శామ్యూల్ బండారం బయటపడింది. పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
Read Also: ముఖానికి పేడ, నోట్లో మూత్రం.. ఇదేం పైత్యం గురూ, ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ వేషాలు చూశారా?