భారతీయ దివంగత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క గోవా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాటా సన్స్ హెడ్ క్వార్టర్స్ బాంబే హౌస్ లో ఉండే గోవా అంటే టాటాకు ఎంతో ప్రేమ. తన దగ్గర చాలా పెట్ డాగ్స్ ఉన్నా.. గోవా మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఓసారి గోవా అనారోగ్యానికి గురి కావడంతో టాటా ఏకంగా విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. అదంటే ఆయనకు అంత ప్రేమ. తాజాగా టాటా అంత్యక్రియల సందర్భంగా గోవాను తీసుకొచ్చారు. తన యజమానని చివరిసారి చూసే అవకాశాన్ని కల్పించారు. ఆయన పార్దివదేహం పక్కన కూర్చొని కంటతడి పెట్టింది. ఆ దృశ్యాన్ని చూసి అందరూ చలించిపోయారు.
రతన్ టాటా లేరని గోవా మృతి
ఇక రతన్ టాటా చనిపోవడాన్ని తట్టుకోలేక గోవా చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అక్టోబర్ 9న టాటా చనిపోగా, మూడు రోజుల తర్వాత గోవా మరణించినట్లు ప్రచారం జరిగింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాలో గోవా వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై ముంబై పోలీసులు స్పందించారు. గోవా చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. “గోవాకు ఎలాంటి సమస్య లేదు. చాలా ఆరోగ్యంగా ఉంది. గోవా చనిపోయినట్లు వస్తున్న వార్తలు నిజం కాదు. ప్రస్తుతం గోవా బాంబే హౌస్ లోనే ఉంది. ఈ విషయాన్ని రతన్ టాటా మిత్రుడు శంతను నాయుడు చెప్పారు. దయ చేసి గోవా చనిపోయిందటూ ప్రచారం చేయకండి” పోలీస్ ఇన్ స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ వెల్లడించారు. ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.
‘గోవా’ను గోవా నుంచి తీసుకొచ్చిన రతన్ టాటా
కొద్ది సంవత్సరాల క్రితం రతన్ టాటా గోవా పర్యటనకు వెళ్లారు. అదే సమయంలో ఆయన వాకింగ్ చేస్తుండగా, చిన్న కుక్కపిల్ల ఆయన వెంట ఫాలో అయ్యింది. కొద్ది దూరం వెళ్లాక ఆయన ఆగడంతో ఆ కుక్కపిల్ల దగ్గరికి వెళ్లి, తన చుట్టూ ప్రేమగా తిరిగింది. టాటాకు ఆ కుక్కపిల్ల మీద ప్రేమ కలిగింది. దాన్ని తీసుకుని ముంబైకి వచ్చారు. గోవాలో దొరికింది కాబట్టి దానికి గోవా అని పేరు పెట్టారు. అప్పటి నుంచి దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ముంబైలోని టాటా సన్స్ హెడ్ ఆఫీస్ బాంబే హౌస్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడు రతన్ టాటాతో పాటు టూర్లకు కూడా వెళ్లేది. టాటా చనిపోయే వరకు ఆ కుక్క ఆయన వెంటే ఉంది.
అనారోగ్యంతో రతన్ టాటా కన్నుమూత
దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా సన్స్ అధినేత రతన్ టాటా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చనిపోయారు. 86 ఏండ్ల ఆయన అక్టోబర్ 9న ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనయ్యింది. తమ సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా దేశ ప్రజలు ఫీలయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
Read Also: నీ వెంటే నేనుంటా.. టాటా అంత్యక్రియల్లో పాల్గొన్న పెంపుడు కుక్క గోవా.. కన్నీళ్లు ఆగవు