Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు జనాలు పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. అసలు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. రోడ్లపై విన్యాసాలు చేయడం, ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాటికి పాల్పడుతూ ఒకరో ఇద్దరు జాగ్రత్తగా బయటపడినా కూడా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే వెలుగుచూశాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ యువకుడు ఉరి వేసుకున్నట్లు వీడియో చేయాలని ప్రయత్నించి ఆ ఉరి బిగుసుకుని ప్రాణాలను కోల్పోయాడు. మరోవైపు ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు సెల్ఫీ కోసం ఓ లోయ వద్ద సెల్ఫీ దిగుతూ 60 అడుగుల లోతులో పడిపోయింది. ఈ తరుణంలో చివరికి ప్రాణాలతోనే బయటపడింది.
అయితే ఇలాంటి ప్రమాదకర ఘటనలు జరుగుతూనే ఉన్నా కూడా సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. సోషల్ మీడియా అంటే ఓ వ్యసనంలా మారిపోయింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసేందుకు ఎంతటి విన్యాసాలైనా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ తల్లి చేసిన పనికి నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లి స్థానంలో ఉండి కన్న బిడ్డ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కసాయిగా ప్రవర్తించింది. కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు బిడ్డ ప్రాణాలను పనంగా పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్, వీసీ సజ్జనర్ తాజాగా స్పందించారు. అసలు ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడడంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఓ తల్లి సోషల్ మీడియాలో వీడియోల కోసం దారుణంగా ప్రవర్తించింది. సొంత బిడ్డ ప్రాణాలను రిస్క్ లో పెట్టింది. ఓ బావి పక్కనే కూర్చుని రీల్స్ చేసింది. ఈ క్రమంలో తన బిడ్డను కూడా తనతో పట్టుకుని ఉంది. ఈ క్రమంలో తన కుడి కాలు బావి ఒడ్డుపై పెట్టి ఎడమ కాలును బావిలోపలికి పెట్టి కూర్చుంది. అంతేకాదు తన బిడ్డను ఒకే చేతితో పట్టుకుని బావిలోకి వేలాడదీసి వీడియోలు చేసింది. అంతేకాదు వీడియోలు చేసే క్రమంలో చేతులకు మారుస్తూ పట్టుకుంటూ ఉంటుంది. ఇలా సొంత బిడ్డ ప్రాణాలను రిస్క్ లో పెట్టి వీడియోలు చేసింది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో వీసీ సజ్జనర్ స్పందించారు. ‘ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి.’ అంటూ సజ్జనర్ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు.
సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి. pic.twitter.com/rp4Qrk2kmn
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 22, 2024