Insurance Policies : సాధారణంగా బీమా పాలసీ తీసుకోవాలంటే.. మనం ప్రీమియం కట్టాలి. కానీ.. పాలసీ లేకుండానే బీమాను పొందే కొన్ని మార్గాలున్నాయి. ఇక్కడ రూపాయి ప్రీమియం లేకుండానే.. మనం బీమా రక్షణ పొందొచ్చు. చాలామందికి తెలియని, పట్టించుకోని.. ఆ ఉచిత బీమాల వివరాలేంటో చూద్దాం.
ఏటీఎం కార్డులపై..
డెబిట్ కమ్ ఏటీఎం కార్డుదారులకు బ్యాంకులు ఉచిత ప్రమాద బీమాని అందిస్తున్నాయి. బ్యాంకును బట్టి ఇది రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. ఇందుకోసం కార్డుదారులు ప్రీమియం కట్టాల్సిన పని ఉండదు. అయితే.. మీ కార్డు వాడకంలో ఉండాలి. కొన్ని బ్యాంకులు.. ఉచిత ప్రమాద బీమాతోపాటు ఆరోగ్యబీమానూ ఫ్రీగా అందిస్తున్నాయి.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్..
రిజిష్టర్ అయిన ప్రతి ఎల్పీజీ సిలిండర్దారుడికీ చమురు కంపెనీలు రూ.40 లక్షల ప్రమాద బీమాను అందిస్తున్నాయి. సిలిండర్ పేలి గాయాలైతే రూ.30 లక్షల వైద్య ఖర్చులకు క్లెయిమ్ చేయొచ్చు. ఆస్తి నష్టానికి రూ.2 లక్షల కవరేజ్ ఉంది. వీటికోసం ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కు కంప్లెయింట్ ఇవ్వాలి.
ప్రయాణ టిక్కెట్లపై..
రైలు ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ.. కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి 35 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల ప్రమాద బీమాతో బాటు అంగవైకల్యానికీ బీమాను అందిస్తోంది. ఇక.. పలు ఎయిర్లైన్స్ తమ ప్రయాణికులకు బీమాను ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎయిర్లైన్స్తో కలిసి తమ కస్టమర్లకు ఏటీఎం కార్డుతోపాటు ఉచిత ప్రమాద బీమాను అందిస్తున్నాయి.
బ్యాంక్ డిపాజిట్లపై..
బ్యాంక్ డిపాజిట్లపైనా రూ.5 లక్షల బీమా హామీ ఉంది. ఏ కారణం చేతనైనా బ్యాంకు ఆ డిపాజిట్లు తిరిగివ్వకపోతే ఆ డబ్బుకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) హామీగా నిలిచి.. రూ.5 లక్షల బీమాను అందిస్తుంది.సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్లన్నిటికీ ఈ ఉచిత బీమా వర్తిస్తుంది.
కంపెనీ డిపాజిట్..
మన దేశంలో డిపాజిట్ల ద్వారా పెట్టుబడులు సేకరించే ప్రతి కంపెనీ 2013 కంపెనీ యాక్ట్ ప్రకారం.. ప్రతి డిపాజిట్పై రూ.20 వేల వరకు ఉచిత బీమాను అందిస్తోంది. ఈ బీమా పాలసీని డిపాజిట్లు సేకరించే ప్రతి కంపెనీ విడిగా తీసుకోవాలి. ఒకవేళ.. కంపెనీ దివాలా తీస్తే.. సదరు బీమా కంపెనీ వారికి హామీ మొత్తాన్ని (రూ.20 వేలు) చెల్లిస్తుంది. కానీ.. కంపెనీ తీసుకున్న పెట్టుబడికి బీమా కంపెనీ బాధ్యత వహించదు.
మొబైల్కు నష్టం జరిగినా..
రిటైలర్లు తాము అమ్మే.. మొబైల్స్పై ఉచిత బీమాను ఇస్తున్నాయి. దీనికోసం.. రిటైల్ కంపెనీలు.. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాయి. నిర్ణీత టైంలోపు మొబైల్ చోరీకి గురైనా, డామేజైనా పాలసీ కింద కస్టమర్లకు బీమా వస్తుంది. అయితే ఈ బీమా మొత్తం అనేది.. ఫోన్ను బట్టి మారుతుంది.