Parliament Security: పార్లమెంట్లో స్మోక్ బాంబ్ దాడి ఘటన.. దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. కొందరు దుండగులు ఎంపీ విజిటర్ పాసులతో లోక్సభలోకి వెళ్లారు. అనంతరం గ్యాలరీ నుంచి కిందకు దూకి స్మోక్ బాంబ్ విసిరి అలజడి సృష్టించారు. దీంతో పార్లమెంట్లో భద్రత కరువైందని.. విపక్షాలు విమర్శించాయి. అంతేకాకుండా దీనిపై కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని పెద్ద ఎత్తున ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ భద్రతా బాధ్యతలు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కు బదలాయించారు. ఇన్నాళ్లు ఢిల్లీ పోలీసులు చూస్తున్న పార్లమెంట్ భద్రతతో పాటు, అగ్నిమాపక బాధ్యతలు కూడా బదిలీ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే.. ప్రత్యేక సర్వే కూడా నిర్వహించాలని CISF డీజీని కేంద్రం ఆదేశించింది. లోక్సభ స్పీకర్తో చర్చల తర్వాత CISF అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. అయితే ఈ సర్వేలో CISF సిబ్బందితో పాటు పార్లమెంట్ భద్రతను పర్యవేక్షిస్తున్న పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్, సీఆర్పీఎఫ్కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ బృందాలు, ఢిల్లీ పోలీసులు కూడా పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.