Congress Second List : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో లిస్టుపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న హస్తం పార్టీ… ఆదివారం మరో 50 మందితో సెకండ్ లిస్టు ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. తొలి జాబితాలో వలసలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన నేతలు.. మైనంపల్లి హన్మంతరావుతో పాటు మైనంపల్లి రోహిత్కు కూడా టికెట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.
ఇక రెండో లిస్టు ప్రకటించనున్న నేపథ్యంలో కామారెడ్డి టికెట్పై ఉత్కంఠ నెలకొంది. గతంలో షబ్బీర్ అలీ ఈ స్థానం నుంచి పోటీ చేయగా.. ఇప్పుడు కేసీఆర్ను ఎదుర్కొనే క్యాండిడేట్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. షబ్బీర్ అలీ స్థానంలో మదన్మోహన్రావు లేదా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కానీ బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
రెండో అభ్యర్థుల లిస్ట్ పై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోసారి కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంకానుంది. ఈ క్రమంలో రేవంత్ హస్తినకు వెళ్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రేపు సెకండ్ లిస్టును ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 60 మంది అభ్యర్థులతో లిస్ట్ రెడీ అయినట్టు సమాచారం. దీంతో రెండో జాబితాలో టిక్కెట్లు ఎవరెవరికి దక్కాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హై కమాండ్ నిర్ణయంపై ఆశవహుల్లో టెన్షన్ కొనసాగుతోంది.