Brahmamudi serial today Episode: అత్తాకోడళ్లు ఇద్దరూ కలిసి రాజ్కు ఎంత నచ్చజెప్పాలని చూసినా రాజ్ మారడు. మిమ్మల్ని ఇక జన్మలో నమ్మనని చెప్తాడు. అసలు మీరు నాకు చెప్పే హక్కును కోల్పోయారు అంటాడు. ఇక నాజీవితం ఇంతే అంటూ ఎమోషనల్ అవుతూ వెళ్లిపోతాడు రాజ్. అపర్ణ వాడిప్పుడు ఆవేశంలో ఉన్నాడు నువ్వేం బాధపడకు అంటూ ఇందిరాదేవి అపర్ణను ఓదారుస్తుంది. అయితే సీతారామయ్యా మాత్రం వాళ్లిద్దర్ని కలపాలనుకున్నప్పుడు నాటకం ఆడటం ఎందుకు? అంటూ వాడి మనసులో కావ్య మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఏదో ఒక విధంగా తట్టి లేపండి. అది నిజాయితీగా అంటూ చెప్పి వెళ్లిపోతాడు.
చీకట్లో కూర్చుని బాధపడుతున్న కనకం దగ్గరకు కావ్య వస్తుంది. ఎందుకమ్మా ఇదంతా చేశావు అంటూ ప్రశ్నిస్తుంది. ఇంతలో మూర్తి వచ్చి మీ అమ్మను ఏమీ అనొద్దమ్మా తను సరైన పనే చేసింది అంటూ కనకాన్ని సమర్థిస్తాడు. దీంతో నాన్నా మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అని కావ్య అడుగుతుంది. అవునమ్మా.. మీరిద్దరూ విడిపోయి దూరంగా ఉంటే మేము అందరం చూస్తూ ఉన్నాము కానీ మిమ్మల్ని కలపడానికి ఏమీ చేయలేదు.
కానీ మీ అమ్మ ఆ పని చేసింది. ఇన్నాళ్లు అది అబద్దాలు ఆడుతుంది. నాటకాలు ఆడుతుంది అనుకున్న కానీ మీ అమ్మే కరెక్టు అమ్మా.. అని ఎమోషనల్ అవుతాడు మూర్తి. దీంతో కావ్య బాధగా కానీ అమ్మ ఓడిపోయింది కదా నాన్న.. అందరి ముందు అవమానాలు పడ్డది కదా? మీ అల్లుడు గారు మోసం చేసింది అన్నారు కానీ ఎందుకు అలా చేసింది అని ఆలోచించలేదు కదా నాన్నా.. అంటూ ఇంకెప్పుడు మమ్మల్ని కలపాలనే ప్రయత్నం చేయకండి అని అమ్మానాన్నలకు చెప్పి వెళ్లిపోతుంది కావ్య.
రుద్రాణి ఎంతో హ్యాపీగా ఉంటుంది. రాజ్ ఇక ఎప్పటికీ కావ్యను ఇంటికి తీసుకురాన్న ఆనందం తన కొడుకు రాహుల్ తో షేర్ చేసుకుంటుంది. అయినా ఆ కనకం తెలివితేటలు మామూలుగా లేవురా.. రాజ్ లాంటి మనిషినే క్యాన్సర్ అని నమ్మించి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి కావ్యతో కలిపేయాలని చూసింది అంటూ ఆశ్యర్యపోతుంది. అవును మామ్ నువ్వు కానీ నిజం బయటపెట్టి ఉండకపోతే ఈ పాటికి కావ్యను ఇంటికి తీసుకొచ్చి హారతి పట్టేవారు అంటాడు రాహుల్. ఆ.. నేను ఉండగా అది జరగనిస్తానా..? ఇప్పుడు చూడు పర్మినెంట్ గా రాజ్, కావ్యను దూరం పెట్టేశాడు అంటూ హ్యాపీగా ఫీలవుతుంది రుద్రాణి.
అవును మామ్ నువ్వు అనుకున్నది సాధించేశావు మామ్. కానీ అమ్మమ్మ నిన్ను లాగిపెట్టి కొట్టింది కదా? అదొక్కటే చిన్న ఇబ్బందిగా ఉంది. బాగా తగిలిందా? మమ్మీ.. అంటూ రాహుల్ అడగ్గానే చీ ఆపరా నీ మాటలు ఇంత హ్యాపీ మూడ్ లో అది గుర్తు చేసుకోవడం అవసరమా? అని ప్రశ్నిస్తుంది. అయినా దేవుడు ఎదురై వరమిస్తే కూడా ఇంకా దరిద్రం గురించి ఆలోచించినట్టు ఉంది నీ ఆలోచన అంటూ తిడుతుంది. ఇంతలో అక్కడకు స్వప్న వస్తుంది. ఇద్దరిని పొగిడినట్టే పొగిడి తిడుతుంది. నేను మీ పార్టీలో చేరాలనుకుంటున్నాను అంటూనే మీలాంటి గుంటనక్కలను నేను ఎక్కడా చూడలేదు అని చెడామడా తిట్టి వెళ్లిపోతుంది.
కావ్య, రాజ్లను కలిపేందుకు మరో ప్రయత్నం చేయడానికి ముగ్గురు( కనకం, అపర్ణ, ఇందిరాదేవి) కలుస్తారు. ఇందిరాదేవి తన పెద్దరికం మంట కలిసిందని బాధపడుతుంది. నేను కూడా అత్తయ్యా కన్నతల్లిగా ఓడిపోయాను అంటుంది అపర్ణ. మీరిద్దరే అలా అంటే నేనేం అనాలి అంటూ వాపోతుంది కనకం. దీంతో ఇందిరాదేవి, కనకాన్ని ఓదారుస్తుంది. నువ్వింకేం అంటావు కనకం. అందరి కన్నా ఎక్కువ మాటలు పడింది నువ్వే కదా…? అంటుంది. ఎంత పడినా ఫలితం మాత్రం రాలేదు కదండి. ఇంత జరిగాకా అల్లుడు గారు నా కూతురును ఇష్టపడతారా? అంటూ బాధపడుతుంది కనకం.
ఇద్దరు కలిసిపోతారని ఆశపడితే శాశ్వతంగా విడిపోయేలా ఉన్నారు. వాడి మనసులో కావ్య ఉందనే విషయాన్ని ఎలా బయటపెట్టాలి అని అపర్ణ ఆలోచిస్తుంది. అయితే ఏం చేసినా ఏం ఆలోచించినా ఇక ముందు తెలివిగా ఆలోచించాలి అని జాగ్రత్త చెప్తుంది ఇందిరాదేవి. అంటే ఇంతకు ముందు నేను తెలివి తక్కువగా ఆలోచించాననే కదా? మీరుంటోంది అని ఇందిరాదేవిని ప్రశ్నిస్తుంది కనకం. దీంతో ఇందిరాదేవి కోపంగా ఏయ్ మా రాజ్ లాగా ప్రతి దానిలో తప్పు తీయకు అంటుంది. తప్పు తీయను కానీ మీరు ఏమీ అనుకోనంటే ఒక్క పని చేయాలని ఉంది అంటుంది కనకం. ఏంటని ఇద్దరూ అడగ్గానే ఆ రుద్రాణిని చంపేద్దామనుకుంటున్నాను అని కనకం చెప్పగానే అపర్ణ, ఇందిరాదేవి ఉలిక్కి పడతారు.
నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు కనకం అంటుంది ఇందిరాదేవి. అపర్ణ మాత్రం నాకో మంచి ఐడియా తట్టింది. అనగానే ఈ సారి ఏం రోగం నాకు అని అడుగుతుంది కనకం. రోగం లేదు.. పాడు లేదు అసలు నాటకమే కాదు నిజాయితీ నిజంగా వాళ్లిద్దరి కలుపుదాం. అందుకోసం కావ్యను ఆఫీసుకు వెళ్లేలా చేయాలి అంటుంది అపర్ణ. కావ్య ఒప్పుకుంటుందా? రాజ్ అంగీకరిస్తాడా? అని కనకం డౌట్ క్రియేట్ చేస్తుంది. దీంతో మనం ముగ్గురం ఉన్నాం వాళ్లిద్దర్ని ఒప్పించలేమా? అంటుంది అపర్ణ.
ముగ్గురు కలిసి కావ్య దగ్గరకు వెళ్తారు. ముగ్గురూ ఒకేసారి కలిసి రావడం చూసిన కావ్య .. లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు అమ్మలు కలిసి వచ్చారు. మళ్లీ ఏదైనా జగన్నాటకం మొదలుపెట్టారా? అని వెటకారంగా అడుగుతుంది. దీంతో ముగ్గురు కావ్య మీద సీరియస్ అవుతారు. మీ ఇద్దర్ని కలపడానికి మేం మంచి ఆలోచనతో వచ్చాం అని చెప్తారు. ఏమీ వద్దని ఇంత వరకు చేసింది చాలని కావ్య చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.