Paytm Payments Bank : మొన్నటి వరకూ దేశంలోనే నంబర్ వన్ పేమెంట్స్ పోర్టల్ అండ్ యాప్ పేటీఎం. కానీ ఇప్పుడు ఆర్బీఐ పెట్టిన ఆంక్షలతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంక్షోభంలో పడింది. ఆర్బీఐ ఆంక్షల కారణంగా.. అనూహ్యరీతిలో ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. దీంతో పేటీఎం పనైపోయిందని, ఇక పేటీఎం సేవలు ఆగిపోతాయని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదంతా తెలిసిన యూజర్లు ఒకవైపు, మరోవైపు పేటీఎం ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకును జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు ఆ వార్త సారాంశం. ఇప్పటికే ఇరు కంపెనీల మధ్య చర్చలు జరిగాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలను పేటీఎం ఖండించింది. మరోవైపు జియో ఫైనాన్స్ కూడా ఈ వార్తలను ఖండించింది. కానీ.. ఈ వార్తే జియో సర్వీసెస్ షేర్ల విలువను పెంచేసింది. సోమవారం జరిగిన ట్రేడింగ్ లో జియో షేర్లు 16.25 శాతం పెరిగి.. రూ.295 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేశాయి.
ఇప్పటికే ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి ప్రవేశించిన జియో.. ఫైనాన్షియల్ మార్కెట్లో మరింత విస్తరించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. జియో ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, జియో పేమెంట్ సొల్యూషన్స్, జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ను.. జియో సంస్థ నిర్వహిస్తోంది. జియో పేమెంట్స్ బ్యాంక్ ప్రస్తుతం డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీసులను నిర్వహిస్తుంది. అలాగే డెబిట్ కార్డ్స్, జియో వాయిస్ బాక్స్ ను కూడా ప్రవేశపెట్టింది.
మరోవైపు.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎదుర్కొంటోన్న సంక్షోభం నుంచి బయటపడతామని ఆ సంస్థ సీఈఓ వియ్ శేఖర్ వర్మ తమ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. 900 మంది ఉద్యోగులతో వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన.. మీ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు.. ఆందోళన చెందకండి అని భరోసా ఇచ్చారు. ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందో ఇంకా స్పష్టత రాలేదని, ఈ అంశంపై ఆర్బీఐతో, వివిధ బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.