Stock Market: స్టాక్ మార్కెట్లలో మరోసారి రక్తపాతం నమోదైంది. ఇండెక్స్లు కుప్పకూలాయి. భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని నెగెటివ్ సెంటిమెంటే ఇందుకు ప్రధానం కారణం.
సెన్సెక్స్ ఓ దశలో 950 పాయింట్లకు పైగా నష్టపోయింది. 3.5 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద కరిగిపోయింది.
సెన్సెక్స్ 927.74 పాయింట్ల నష్టంతో 59,744.98 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 272.40 పాయింట్లు నష్టపోయి 17,554.30 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.85గా ఉంది.
మంగళవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. ఫిబ్రవరిలో వ్యాపార కార్యకలాపాలు 8 నెలల గరిష్ఠ స్థాయికి చేరాయన్న గణాంకాల నేపథ్యంలో యూఎస్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది.
ఆర్బీఐ, ఫెడ్ పాలసీ మినిట్స్ టెన్షన్ మార్కెట్లను కుదిపేసిందని చెబుతున్నారు. ద్రవ్యోల్బణంపై ఎలాంటి వైఖరి ఉంటుందనే భయాందోళనతో మదుపర్లు అమ్మకాలు జరిపారు. వడ్డీరేట్ల పెంపు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్న విశ్లేషణలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి.
బజాజ్ షేర్లు, ఎంఅండ్ఎం, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్అండ్టీ షేర్లు సుమారు 2శాతం వరకూ పతనమయ్యాయి. ఐటీసీ షేర్ ఒక్కటే పాజిటివ్గా క్లోజ్ అయింది.
ఇక, అదానీ గ్రూప్ షేర్లు మరోసారి పాతాళాన్ని చూశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 10 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్ షేర్లు 5 శాతం నష్టపోయాయి. ఈ ఒక్కరోజే గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 51వేల కోట్ల వరకు ఆవిరైంది. కంపెనీయే కావాలని అనుకూల వ్యాసాలు రాయించిందని వికీపీడియా చేసిన ఆరోపణలు అదానీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. నెగటివ్ న్యూస్తో పాటు మార్కెట్లో వీక్నెస్తో అదానీ గ్రూప్ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి.
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత జనవరి 25 నుంచి అదానీ షేర్ల పతనం మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల కోట్లకు పైగా సంపద కరిగిపోయింది. నెల వ్యవధిలో 60 శాతానికి పైగా అదానీ షేర్ విలువ ఆవిరైంది. మదుపర్లకి భారీ నష్టాలు వచ్చాయి.