ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు ప్రాణహాని ఉందంటూ ఫోన్ రావడం కలకలం రేపుతోంది. ఇటీవల ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. రతన్ టాటాకు ప్రాణహాని ఉందని హెచ్చరించినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. టాటాకు భద్రత పెంచాలని, లేదంటే ఆయనకు కూడా టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి జరిగినట్లే అవుతుందని హెచ్చరించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ వారం ఆరంభంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
రతన్ టాటాకు ప్రాణహాని ఉందని ఫోన్ కాల్ రావడంతో.. ముంబై పోలీసులు అలర్టయ్యారు. ఆయనకు భద్రతను పెంచడంతో పాటు కొన్ని తనిఖీలు కూడా చేసినట్లు తెలిపారు. అలాగే ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి గురించి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక నుంచి ఆ ఫోన్ వచ్చినట్లు గుర్తించి.. లొకేషన్ ట్రేస్ చేశారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు పుణెకు చెందినవాడిగా గుర్తించారు. కొద్దిరోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయిన అతను.. కర్ణాటక నుంచి ముంబై పోలీసులకు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. కాగా.. అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ గతేడాది సెప్టెంబర్ 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబై కు కారులో వెళ్తుండగా.. డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మిస్త్రీతో పాటు.. కారులో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు.