బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుపాను ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తాజాగా ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ లో.. మంగళవారం ఏపీతో పాటు తెలంగాణలోనూ అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. నెల్లూరు, ఒంగోలు, కడప, ప్రొద్దుటూర్, నంద్యాల, మార్కాపురం, చీరాల, గూడూరు, మచిలీపట్నం, దర్శి, రేపల్లె రాయలసీమలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని విమానాలను దారిమళ్లిస్తున్నారు. ఎయిర్ పోర్టులలో రన్ వే ల పైకి నీరు చేరడంతో.. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బుధవారం నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని తెలిపింది. అలాగే తుపాను క్రమంగా వాయుగుండంగా బలహీన పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ఏపీని అల్లోకల్లోలం చేస్తున్నాయి.