Mayawati Political Heir : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి.. తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. రెండు రాష్ట్రాలు మినహా ఇతర ప్రాంతాల్లో బీఎస్పీకి వారసుడిగా ఆకాష్ ఆనంద్ని ప్రకటించారు. ఈరోజు లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మాత్రం పార్టీ బాధ్యతలను మాయావతి పర్యవేక్షించనున్నట్లు సమచారం.
ఆకాష్ ఆనంద్… మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కొడుకు. 31 ఏళ్ల ఆనంద్.. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ గతేడాది పార్టీ ఇన్ఛార్జ్గా కూడా నియమితులయ్యారు. 2016లో బీఎస్పీలో చేరిన ఆనంద్.. 2018లో రాజస్థాన్లో బీఎస్పీ ఎన్నికల ప్రచారంలో కనిపించారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా ముఖ్య బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికలకు ఇంకా 5 నెలలు మాత్రమే ఉన్న క్రమంలో బీఎస్పీకీ కొత్త చీఫ్గా ఆనంద్ ని నియమించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.