Kalamassery Blasts : కేరళలోని ఎర్నాకుళంలో కలమస్సేరి సమీపంలో జరిగిన పేలుళ్లు.. ముందస్తు ప్రణాళికలతోనే జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహిబ్ ధృవీకరించారు. కలమస్సేరి సమీపంలో ఒక చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా.. ఒక టిఫిన్ బాక్స్ లో అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)పేలడంతో ఈ దారుణం జరిగిందన్నారు. ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో 37 మంది గాయపడినట్లు తెలిపారు. ఒక పేలుడు తర్వాత.. మరో రెండుసార్లు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం ఘటనా ప్రాంతానికి చేరుకుంది. ఎన్ఐఏ ప్రాథమిక నివేదికల ప్రకారం.. పేలుళ్లలో తక్కువ తీవ్రత కలిగిన పదార్థాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్ఐఏ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, యాంటీ టెర్రర్ ఏజెన్సీలను వెంటనే కేరళకు పంపాలని అధికారులను ఆదేశించారు. కేరళలో జరిగిన పేలుళ్ల ఘటనపై కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు వీడీ సతీశన్ స్పందించారు. ఇది చాలా విచారకరంగా ఉందన్నారు. ఘటనలో గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఆదివారం ఉదయం 9.40 గంటలకు పేలుడు జరుగగా.. ఆ సమయంలో 2500 మంది ప్రజలు చర్చిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పేలుళ్ల వెనుక ఉగ్రకుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అందుకు కారణం లేకపోలేదు. హమాస్ మాజీ నాయకుడు ఖలీద్ మషాల్ కేరళకు ఉత్తరాన ఉన్న మలప్పురంలో ఒక సమావేశానికి వర్చువల్ గా హాజరైన ఒక రోజు తర్వాత పేలుళ్లు జరగడంతో ఉగ్రదాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమావేశంలో పాల్గొన్న జమైత్-ఇ-ఇస్లామీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.