Odisha: ఇటీవల వరుసగా పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో సోదాలు నిర్వహించేందుకు వెళ్ళిన ఐటీ శాఖ అధికారులకు బీరువాల నిండుగా నోట్ల కట్టలు దర్శనమివ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒడిశా లోని పలువురు మద్యం వ్యాపారులు ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారనే సమాచారంతో.. ఐటీ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు.
తాజాగా టిట్లాగఢ్ పట్టణంలో ఉంటున్న దీపక్ సాహు, సంజయ్ సాహు, రాకేశ్ సాహుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బీరువాల నిండా పేర్చి ఉన్న నోట్లకట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. దాదాపు 510 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 20 ప్రాంతాలతో పాటు ఝార్ఖండ్, కోల్కతాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది.
మరోవైపు రాయగడ గాంధీనగర్లో ఉంటున్న మద్యం వ్యాపారి అరవింద్ సాహు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ ఎంత నగదు దొరికిందో అధికారుల ఇంకా వెల్లడించాల్సి ఉంది.