Kohli-Rahul : టీం ఇండియా లో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో కోహ్లీని ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుస్తారు. తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనే సమయంలో కూడా తన బ్యాట్ తో మెరుపులు మెరిపించడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. ఓపనర్లు వరసగా స్కోర్ లో కోడిగుడ్లను.. తీరులో బాతు గుడ్లను కనబరుస్తూ డకౌట్ అవుతూ ఉంటే.. నేనున్నాను ..అంటూ నిలబడి మ్యాచ్ లో ప్రత్యర్ధులతో కలబడి ఎట్టకేలకు టీమిండియా పరువు నిలబెట్టాడు. మరొకసారి జట్టుకి కోహ్లీ అవసరం ఎంత ఉందో తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో టీం ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియా పై ఘన విజయంతో ముగించింది. ఆరంభ మ్యాచ్ కావడంతో.. ఇందులో టీం ఇండియా గెలుపు అత్యంత కీలకంగా మారింది. చెన్నై లోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కి మొదట వరుణుడు అడ్డుపడతాడేమో అని సర్వత్రా టెన్షన్ నెలకొంది. కానీ వాతావరణం సహకరించడంతో మ్యాచ్ ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగింది.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈసారి టీమిండియా బౌలర్లు ఎంతో కట్టుదిట్టమైన క్రమశిక్షణతో ఆడడంతో కంగారోలు కంగారు పడిపోయారు.. 199 పరుగులకే చేతులెత్తేసారు. జస్ప్రీత్ బుమ్రా… మూడో ఓవర్ ముగియక ముందే ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ను చేసిన డక్ ఔట్ కలిసొచ్చింది . ఆ తర్వాత కుదురుకుంటాడు.. హాఫ్ సెంచరీ చేస్తాడు అనుకున్న డేవిడ్ వార్నర్ .. కుల్దీప్ యాదవ్ చేతిలో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజా తన జాదు చూపించి ఏకంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా భారత్ బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ కథ 199 పరుగులకే ముగిసిపోయింది.
చాలా తక్కువ స్కోరు…ఇట్టే ఆడేస్తారు అని సంబరాలు చేసుకున్న అభిమానుల ఆశ టీమిండియా బ్యాటింగ్ మొదలుపెట్టిన కాసేపటికే అడుగంటి పోయింది. ఒకరి తర్వాత ఒకరు డక్ అవుట్ అవ్వడమే మా ప్రధాన లక్ష్యం…అదే మా నినాదం.. అన్నట్లు 0 పరుగులకు అవుట్ అయి పెవీలియన్ వైపు పరుగులు పెట్టారు. ఆరంభంలోనే షాక్ మీద షాక్ తగలడంతో అసలు ఈ మ్యాచ్ గట్టెక్కుతారా అని అందరూ భయపడ్డారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే తడబడడంతో అభిమానులు నిరాశ చెందారు.
ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వరుస డక్ ఔట్ లు తో డీలా పడ్డ టీం ఇండియాను కోహ్లీ, రాహుల్ ఆదుకున్నారు. పరుగుల ఖాతా పూర్తిగా ముందే.. పెవీలియన్ వైపు పరుగులు పెడుతున్న టీం కు వన్ డౌన్ బ్యాటర్ కింగ్ కోహ్లీ…85 పరుగులు చేసి ముందుకు నడిపించాడు. మరోపక్క రాహుల్ 97 పరుగులు చేసి టీంకు అండదండగా నిలబడ్డాడు. ఈ ఇద్దరు కలిసి నెలకొల్పిన 165 పరుగుల భాగస్వామ్యం నాలుగో వికెట్ కు వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు స్థాయి అని చెప్పవచ్చు. మ్యాచ్ అయిపోతోంది అనుకునే సమయానికి సరిగ్గా 38వ ఓవర్ లో నాలుగవ బంతికి కోహ్లీ అవుట్ అవ్వడంతో పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది.
అయితే కోహ్లీ తర్వాత క వచ్చిన హార్దిక్ పాండ్యా… . 8 బంతులు ఎదుర్కొని ఒక భారీ సిక్స్ తో బంతిని బౌండరీ దాటించి మొత్తానికి 11 పరుగులు సాధించాడు. దీంతో లక్ష్యాన్ని 41.2 ఓవర్లలో చేదించిన టీం ఇండియా ఆస్ట్రేలియా జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇలా నానా తంటాలు పడి ఎట్టకేలకు వరల్డ్ కప్ 2023 ఆరంభం మ్యాచులు విజయం సాధించి బోణీ కొట్టింది.