Banswada Politics : తెలంగాణలో ఎన్నికల వేళ పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇంటికి.. బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ తనయుడు భాస్కర్రెడ్డి వచ్చారని ఆరోపణలు వచ్చాయి. తనను హత్య చేసేందుకు ఆయన వచ్చారని ఆరోపిస్తున్నారు యెండల.
భాస్కర్రెడ్డి అనుచరులతో కలసి యెండల ఇంటికి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తనను భాస్కర్రెడ్డి బెదిరిస్తున్నారని యెండల ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు.
బాన్సువాడలో బీజేపీ అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. పోలింగ్ కు ఒక్కరోజు ముందు యెండలకు బెదిరింపులు రావడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఓట్లు చీలిస్తే.. బీఆర్ఎస్ కే నష్టం జరుగుతుందా? అందుకే యెండలను బెదిరిస్తున్నారా? అంటే స్థానికులు అవుననే అంటున్నారు.