Gujarat : దేశంలో దళితులపై అప్పుడప్పుడూ జరుగుతున్న దారుణాలను చూస్తూనే ఉన్నాం. దళితుల ముఖంపై మూత్ర విసర్జన, నోటిలో మూత్రం పోయడం వంటి దారుణాలు చాలానే జరిగాయి. తాజాగా మరో దళితుడిపట్ల మహిళా యజమాని అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దళిత వ్యక్తి జీతం అడిగినందుకు అతను పనిచేస్తున్న కంపెనీ యజమానురాలు చితకబాది.. నోటితో తన చెప్పులు నాకమని బలవంతం చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో జరిగింది.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నీలేష్ కిషోర్ భాయ్ దల్సానియా అనే యువకుడు రాణిబా ఇండస్ట్రీస్ మార్కెటింగ్ విభాగంలో పనిచేసేవాడు. అక్టోబర్ 2న కంపెనీలో చేరగా..నెలకు రూ.12 వేల జీతం చెల్లించాలని ఒప్పందం జరిగింది. కానీ.. అక్టోబర్ 12న అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అతని సోదరుడు మెహుల్, మరో స్నేహితుడు భవేష్ మక్వానాతో కలిసి 16 రోజుల బకాయి జీతం ఇవ్వాలని అడిగేందుకు రాణిబా ఇండస్ట్రీస్ కార్యాలయానికి వెళ్లాడు. అక్టోబర్ లో చేసిన పనికి గాను పెండింగ్ జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కంపెనీ యజమానురాలైన విభూతి సోదరుడు.. ఓం పటేల్ బాధిత వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. అలాగే ఆఫీస్ మేనేజర్ పరీక్షిత్ పటేల్ బెల్టుతో కొట్టారు. ఇంతలో అక్కడికి వచ్చిన విభూతి.. తన నోటితో చెప్పులు నాకి క్షమాపణలు చెప్పాలని బలవంతం చేసింది. తనకు జరిగిన అవమానంపై నీలేష్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విభూతి పటేల్ అలియాస్ రాణిబా, ఓం పటేల్, పరీక్షిత్, డిడి రబారి సహా తనను వేధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెండింగ్ లో ఉన్న జీతం చెల్లించాలని అడిగినందుకు కొట్టి అవమానించడమే కాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తనను చంపుతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.