Fraud Bride : ఆ యువకుడు తన జీవితంలో ఒక భాగస్వామి రాబోతోందని ఎన్నో కలలు కన్నాడు. మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి జరిగిన రాత్రి నుంచే పెళ్లికూతురు కనబడుటలేదు. ఆమె ఎక్కడికి పోయిందో, ఏమైందో అని ఆందోళన చెందిన వరుడు తెలిసిన వారందరినీ అడిగాడు. కానీ ఆమె జాడ తెలియలేదు.
Fraud Bride : ఆ యువకుడు తన జీవితంలో ఒక భాగస్వామి రాబోతోందని ఎన్నో కలలు కన్నాడు. మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి జరిగిన రాత్రి నుంచే పెళ్లికూతురు కనబడుటలేదు. ఆమె ఎక్కడికి పోయిందో, ఏమైందో అని ఆందోళన చెందిన వరుడు తెలిసిన వారందరినీ అడిగాడు. కానీ ఆమె జాడ తెలియలేదు. అయితే ఆ పెళ్లి కుదిర్చిన బ్రోకర్ని గట్టిగా ప్రశ్నిస్తే అతను మనుషులతో కొట్టించాడు. దీంతో ఆ వరుడు ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది.
పోలీసు కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం పాలి నగరానికి చెందిన పాపారాం కుమావత్ అనే యువకుడు జూన్ 2023లో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సంబంధం ఒక బ్రోకర్ ద్వారా కుదిరింది. మంచి సంబంధం కుదర్చడానికి ఆ బ్రోకర్ కుమావత్ వద్ద నుంచి రూ.5 లక్షలు ఫీజు తీసుకున్నాడు.
అయితే వివాహం జరిగిన తొలిరాత్రే పెళ్లికూతురు తనకు అనారోగ్యంగా ఉందని బయటికి తీసుకెళ్లమని వరుడు కుమావత్కు చెప్పింది. కొత్త పెళ్లికూతురు అడిగింది కదా అని కుమావత్ ఆమెను తన కారులో బయటికి తీసుకెళ్లాడు. అలా వెళ్లిన తరువాత ఒక చోట కారు అపమని చెప్పి.. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లింది. అంతే ఇక మళ్లీ ఆమె తిరిగి రాలేదు. భార్య ఏ ఆపదలో ఉన్నదో అని ఆందోళన చెందిన కుమావత్ ఆమె కోసం ఎంతో గాలించాడు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో పెళ్లికూతురు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వారి ఫోన్ స్విచాఫ్ వచ్చింది.
ఇక కుమావత్కు తెలిసింది ఆ బ్రోకర్ మాత్రమే. వెంటనే కుమావత్ ఆ పెళ్లి బ్రోకర్ను సంప్రదించాడు. కానీ అతను తనకేం తెలియదని చెప్పాడు. వారి బంధువులను అడిగి చెబుతానని చెప్పాడు. రోజులు గడిచినా ఏ సమాచారం లేదు. దీంతో కుమావత్ ఆ బ్రోకర్తో గొడవ పెట్టుకున్నాడు. పెళ్లి కోసం తీసుకున్న రూ.5 లక్షల డబ్బును తిరిగి ఇవ్వాలని చెప్పాడు. ఆ సమయంలో బ్రోకర్ సరేనని చెప్పి కొంత గడువు అడిగాడు. కానీ ఆ తరువాత రాత్రిపూట కుమావత్ ఇంటికి రౌడీలను పంపించి కొట్టించాడు. అంతేకాదు ఆ రౌడీలు కుమావత్కు కరెంట్ షాకిచ్చారు. ఈ ఘటనలో కుమావత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి చేర్చాల్సి వచ్చింది. పోలీసులకు కుమావత్ కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ బ్రోకర్ని అరెస్టు చేయడానికి వెళితే.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది.
పోలీసులు ఆ బ్రోకర్, పెళ్లికూతురుపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రాజస్థాన్, హర్యాణాలో ఇలాంటి ఘటనలు గత కొంత కాలంగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి కారణం ఆ రాష్ట్రాలలో మహిళల జనాభా తక్కువగా ఉండడమే. కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఇంట్లో ఆడపిల్ల పుడితే.. పుట్టగానే చంపేసేవారు. ఈ తప్పుడు సంస్కృతి వల్లే ఆ రాష్ట్రాలలో గత కొన్ని సంవత్సరాలుగా స్త్రీల సంఖ్యగా తక్కువగా ఉంది. దీంతో యువకులకు పెళ్లి చేసుకోవడానికి యువతులు కరువయ్యారు. ఫలితంగా పక్క రాష్ట్రాల నుంచి ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అవకాశంగా తీసుకొని కొంతమంది పెళ్లిబ్రోకర్లు భారీగా సంపాదింస్తున్నారు.