Apple : యాపిల్ అంటే స్టేటస్ బ్రాండ్. ఈ సంస్థ ఫోన్లు, ట్యాబ్ లు, ల్యాప్ టాప్స్, వాచీలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. కానీ భారత్ లో ఇంతవరకు యాపిల్ రిటైల్ స్టోర్ లేదు. ఇప్పుడు దేశంలో తొలి రిటైల్ స్టోర్ ను ప్రారంభించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఏప్రిల్ 18న ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఈ స్టోర్ ప్రారంభంకానుంది. ఈ స్టోర్ను యాపిల్ బీకేసీగా వ్యవహరిస్తున్నారు. యాపిల్ బీకేసీ లోగోను ముంబై ఐకానిక్ ఆర్ట్ ‘కాలీపీలి టాక్సీ ఆర్ట్’తో తీర్చిదిద్దారు.
భారత్ లో యాపిల్ రెండో స్టోర్ను ఏప్రిల్ 20నే ప్రారంభించాలని ఆ సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ స్టోర్ ను ప్రారంభిస్తారు. ఈ స్టోర్ను యాపిల్ సాకేత్ గా వ్యవహరిస్తున్నారు. కానీ ఢిల్లీ స్టోర్ ప్రారంభం ఎప్పుడనేదానిపై యాపిల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. యాపిల్ సాకేత్ స్టోర్పై ఉండే లోగోను ఢిల్లీ మహానగర సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా రూపొందించారు.
భారత్లో ఏర్పాటు చేస్తున్న రిటైల్ స్టోర్లను.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం వచ్చేవారం భారత పర్యటనకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. చివరిసారి టిమ్ కుక్ 2016లో భారత్లో పర్యటించారు.
భారత్లో వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని యాపిల్ యోచిస్తోంది. చైనా వెలుపలకు యాపిల్ తయారీ కార్యకలాపాలను తీసుకెళ్లాలని భావిస్తోంది. అందుకే భారత్కు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.