Congo Mike Kalambay| ఆఫ్రికా దేశమైన కాంగోలో ఒక సంగీత కార్యక్రమంలో భారీగా జనం తరలివచ్చారు. ప్రముఖ గాయకుడిని సమీపం నుంచి చూడడానికి వెళ్లి తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన కాంగో రాజధాని నగరం కిన్స్హాసలోని స్టాడె డేస్ మార్టిర్స్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగింది.
ప్రముఖ క్రిస్టియన్ మత గాయకుడు మైక్ కలంబే పాడుతున్న సమయంలో ఈ ఘటన జరగడం విషాదకరమని కిన్స్ హాసా గవర్నర్ డేనియల్ బుంబా తెలిపారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ..” సంగీత కార్యక్రమానికి వచ్చిన జనం స్టేజి దెగ్గరకు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి.. ఏడుగురు చనిపోయారు, మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు” అని అన్నారు.
స్టేడియం కెపాసిటీ 80 వేల మంది ఉన్నప్పటికీ.. కార్యక్రమానికి 30 వేల మంది హాజరయ్యారని.. ఇందులో తమ తప్పు ఏమీ లేదని సంగీత కార్యక్రమాన్ని నిర్వహించిన కంపెనీ మాజబు గాస్పెల్ తెలిపింది. క్రిస్టియన్ గాస్పెల్ సంగీతకారులు, మత గాయకులలో చాలా మంది కళాకారులు పాటలు పాడినప్పటికీ.. ప్రముఖ గాయకుడు మైక్ కలంబే పాడుతున్నప్పుడు చాలా మంది ఆయన అభిమానులు బారికేడ్లు దాటి సెంటర్ స్టేజీ వద్దకు చొచ్చుకొని రావడంతో తొక్కిసలాట జరిగింది.
అక్టోబర్ 2023లో కూడా ఇదే స్టేడియంలో జరిగిన సంగీత కార్యక్రమంలో తొక్కిసలాట వల్లే 11 మంది చనిపోవడం గమనార్హం.
Also Read: ఇజ్రాయెల్లో బాంబు పేలుడు.. 11 మంది పిల్లలు మృతి, 20కి తీవ్ర గాయాలు