Bengaluru Bomb Blackmails: బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా అరగంట వ్యవధిలో 15కు పైగా స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఇ-మెయిల్స్ వచ్చాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ మెయిల్ ద్వారా బసవేశ్వర్నగర్ నాఫెల్ స్కూల్, యెలహంకలోని మరో స్కూల్తో పాటు 14 స్కూళ్లకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు గుర్తు తెలియని వ్యక్తి.
మొదట ఏడు పాఠశాలలపై పేలుళ్లు జరుగుతాయని బెదిరింపులు వచ్చాయి. బసవేశ్వర్ నగర్లోని నేపెల్, విద్యాశిల్ప స్కూళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి ఎదురుగా ఉన్న పాఠశాలకు కూడా బెదిరింపు మెయిల్ వచ్చింది. కొద్దిసేపటికే మరికొన్ని స్కూళ్లకు కూడా అలాంటి మెయిల్స్ రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను స్కూల్ నుంచి ఇళ్లకు తీసుకెళ్లారు. స్కూళ్లకు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని.. మెయిల్ వచ్చిన అన్ని స్కూళ్లలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు బెంగళూరు సీపీ దయానంద్. గతంలో కూడ ఇదే తరహా బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు సీపీ దయానంద్. స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు బూటకమని సంకేతాలు ఉన్నప్పటికీ.. బాంబు డిస్పోసల్ స్క్వాడ్స్ క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఏ పాఠశాలలోనూ బాంబులు ఉన్నట్లు ధృవీకరించలేదు.
బెంగళూరులోని స్కూళ్లకు బెదిరింపు ఇ-మెయిల్స్ రావడంతో సదాశివ నగర్లోని నీవ్ అకాడమీ పాఠశాలను సందర్శించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. బెదిరింపు మెయిల్స్పై ఆరా తీసి.. పోలీసులను అడిగి తెలుసుకున్నారు. టీవీ ద్వారా ఈ సమాచారం తనకు తెలిసిందని.. వెంటనే తన ఇంటికి దగ్గరలో ఉన్న నీవ్ స్కూల్కు వచ్చానన్నారు డీకే శివకుమార్.
.
.