ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హస్తం అగ్రనేతలైన సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు. మల్లికార్జున ఖర్గే షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీని కూడా కాంగ్రెస్లో విలీనం చేశారు.
తెలంగాణ ఎన్నికల నాటి నుంచి షర్మిల పార్టీ విలీనంపై ఉత్కంఠ కొనసాగింది. అప్పట్లో చర్చలు కుదరకపోవడంతో షర్మిల సైలెంట్ అయ్యారు. అయితే,.. వైఎస్ఆర్ బిడ్డ కావడంతో ఏపీలో ఆమెను దించితే పార్టీ బలోపేతం అవుతుందన్న ప్రచారం అప్పట్లోనే సాగింది. అంతా ఊహించినట్టే చివరికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తూ.. తన సొంత అన్న అయిన వైసీసీ అధినేత సీఎం జగన్పై పొలిటికల్ యుద్ధం చేయడానికి షర్మిల సిద్ధమైంది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అన్నారు. వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉన్నారని, రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిని చేయడం తన తండ్రి కల అని చెప్పిన షర్మిల.. తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నట్లు చెప్పారు. ఇకపై వైఎస్సార్టీపీ లేదని.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశామని షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ తనకు ఏ బాధ్యతను అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని షర్మిల తెలిపారు.