YS Sharmila | వైఎస్ఆర్టిపి (YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే తెలంగాణ ఎన్నికల ప్రచారం ఫ్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై వేచి చూస్తూ.. ఇప్పటికే షర్మిల ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేశారు. దీంతో వైఎస్ఆర్టిపి అసలు ఎన్నికలలో పోటీ చేస్తుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి
YS Sharmila : వైఎస్ఆర్టిపి (YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే తెలంగాణ ఎన్నికల ప్రచారం ఫ్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై వేచి చూస్తూ.. ఇప్పటికే షర్మిల ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేశారు. దీంతో వైఎస్ఆర్టిపి అసలు ఎన్నికలలో పోటీ చేస్తుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
కానీ వైఎస్ఆర్టిపి వర్గాలు ఈ అనుమానాలపై స్పష్టతనిచ్చాయి. షర్మిల గతంలో చెప్పినట్టుగానే పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. నవంబర్ ఒకటో తేది నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు నామినేషన్ వేయడానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. నవంబర్ 4న షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ తరపు నుంచి ఉపేందర్రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. దీంతో పాలేరు ఎన్నికలలో షర్మిలకు గట్టి పోటీ ఎదురవబోతోంది.
కాంగ్రెస్ నుంచి పొంగులేటి పేరు ఖరారు అయినప్పుడు.. ఆయన బలమైన నాయకుడు కాబట్టి, షర్మిల వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్ నడిచింది. ఈ పరిస్థితులలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపై షర్మిల పోటీ చేస్తారనే వార్తలు కూడా బలంగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తారని క్లారిటీ వచ్చింది.
వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా పొంగులేటికి పేరుంది . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్లో చేరబోయే ముందు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను పొంగులేటి స్వయంగా కలిశారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం లోక్సభ స్థానం నుంచీ గెలిచారు. అలాంటి నాయకుడు వైఎస్ షర్మిల మీద పోటీకి దిగబోతోన్నారు. తెలంగాణలో రసవత్తరంగా మారబోయే అసెంబ్లీ ఎన్నికల పోరులో పాలేరు కూడా ఒకటి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు.