షర్మిల కాంగ్రెస్లో చేరడం దాదాపు కన్ఫామ్ అయినట్టే కనిపిస్తోంది. రెండురోజులు ఢిల్లీలో మకాం వేసి.. అధిష్టానంతో అంతా మాట్లాడుకొచ్చారు. రేపోమాపో జాయినింగ్ అంటూ కొన్ని డేట్లు కూడా లీకులొస్తున్నాయి. షర్మిలను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఎంపీ కోమటిరెడ్డి ఆమెకు రూట్ క్లియర్ చేశారు. షర్మిలతో లాభమే అంటూ ఫుల్ సపోర్ట్ చేశారు. త్వరలోనే అన్నివిషయాలు చెబుతానంటూ తెలంగాణ కోడలు ముసిముసి నవ్వులు నవ్వుతూ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చారు.
ఇదంతా ఓవర్ నైట్ జరిగింది కాదు. వైఎస్ షర్మిలా పక్కాగా పావులు కదిపారు. అంతా ప్రీ ప్లాన్డ్గా చేశారని అంటున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్కు పదే పదే షేక్ హ్యాండ్ ఇస్తూవస్తున్నారు వైఎస్సార్టీపీ అధినేత్రి. అయితే, ఆమె ఇస్తున్న హ్యాండ్ను టి.కాంగ్ నేతలవెరూ అందుకోలేదు. అయినా, వదలట్లేదు షర్మిల. బెంగళూరుకు రెగ్యులర్ ట్రావెలర్ అయ్యారు. కుటుంబ సన్నిహితుడు డీకే శివకుమార్ సాయంతో నేరుగా ఢిల్లీ కాంగ్రెస్తోనే టచ్లోకి వెళ్లారు. రాహుల్గాంధీపై ట్వీట్లు చేస్తూ.. నేనున్నానంటూ గుర్తు చేశారు. తాజా హస్తిన పర్యటనతో.. దాదాపు డీల్ ఓకే చేసుకొచ్చారు.
షర్మిల పక్కా స్కెచ్తోనే పొలిటికల్ పార్టీ పెట్టారని ఇప్పుడు అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ ప్రముఖులు. అప్పట్లో తనకు ఏమాత్రం ఉనికి లేని సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉంటే ఆమెను ఎలాంటి ప్రాధాన్యం లభించేది కాదు. ఆ సంగతి తెలిసే.. వైఎస్సార్టీపీ అంటూ సొంతపార్టీతో తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. అదేంటి? తెలంగాణలో షర్మిల పార్టీ ఏంటి? అంటూ అంతా ఆశ్చర్యపోయారు అప్పట్లో. ఎందుకో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోందని అంటున్నారు. తన వెంట పెద్ద నేతలెవరూ లేకున్నా.. కార్యకర్తల బలమూ అంతగా లేకపోయినా.. రెండేళ్లుగా పార్టీని ప్రైవేట్ ఈవెంట్గా నెట్టుకొస్తున్నారు. వన్ ఉమెన్ ఆర్మీలా అంతా షర్మిలనే. పాదయాత్రలు, ప్రెస్మీట్లు, ధర్నాలు, ఆందోళనలు, అరెస్టులు, ట్వీట్లు.. అంతా ఆమెనే. ఇలా బలంగా ఉనికి చాటుకున్నాక.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో బేరం పెడుతున్నట్టు తెలుస్తోంది. తనను చూసి కేసీఆరే భయపడుతున్నారని.. అందుకే పదే పదే తనను అడ్డుకుంటున్నారంటూ.. అలాంటి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే.. తనకేంటి? అంటూ డీకే ద్వారా ఢిల్లీని డీల్ చేస్తున్నట్టు సమాచారం.
అసలే వైఎస్సార్ కూతురు. తండ్రి చరిస్మా ఎలానూ ఉంటుంది. రెడ్డి బ్యాక్ గ్రౌండ్. క్రిస్టియన్ మార్క్. మహిళా కార్డ్. షర్మిలతో అనేక ప్రయోజనాలు ఉండొచ్చని కాంగ్రెస్ అధిష్టానం ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పార్టీలో చేరితే తనకు కీలక పదవి.. నెగ్గితే హైప్రయారిటీ ఇవ్వాలంటూ షర్మిల సైతం గట్టిగానే పట్టుబడుతున్నట్టు చెబుతున్నారు. బీజేపీలో విజయశాంతి, జయసుధలాంటి స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారని.. కాంగ్రెస్లో అలాంటి ఇమేజ్ ఉన్న లేడీ లీడర్ ఒక్కరు కూడా లేరని అధిష్టానానికి సినిమా చూపిస్తున్నారని తెలుస్తోంది. తానను పార్టీలో చేర్చుకుంటే.. సింగిల్ హ్యాండ్.. ఇటు బీఆర్ఎస్ను, అటు బీజేపీని డీల్ చేస్తానని.. కాకపోతే తనను నెత్తిన పెట్టుకుంటేనే ఇదంతా చేస్తానంటూ బేరాలు పెట్టారట షర్మిల.
ఢిల్లీ ఇంట్రెస్ట్గానే ఉన్నా.. స్టేట్ లీడర్స్ మాత్రం షర్మిలకు అంతసీన్ లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్. షర్మిల పార్టీలో చేరితే.. కీలక పదవిలో కూర్చుంటే.. తమకు కష్టమనేది వారి భావన. అయితే, ఇటీవల క్రిస్టియన్ అయిన జయసుధ కాషాయ కండువా కప్పుకోవడంతో.. ఆ వర్గం ఫాలోయింగ్ ఫుల్గా ఉన్న షర్మిలను అర్జెంటుగా పార్టీలో చేర్చుకోక తప్పనిసరి పరిస్థితి కాంగ్రెస్పార్టీది. అందుకే, రాష్ట్ర కాంగ్రెస్ వద్దంటున్నా.. జాతీయ కాంగ్రెస్ మాత్రం కావాలనే అంటోందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో వైఎస్సార్కు అనుంగ శిష్యుడిగా ముద్రపడిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాత్రం షర్మిల రాకకు గట్టి సపోర్ట్ చేస్తుండటం ఆసక్తికరం. ఆ మద్దతు షర్మిల కోసమేనా? లేదంటే.. ఇంకెవరికైనా చెక్ పెట్టేందుకా? అనే అనుమానమూ వ్యక్తం అవుతోంది.