వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటన ఆసక్తిని రేపుతోంది. ఆమె హస్తిన టూర్ అత్యంత గోప్యంగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలు సహా పలు అంశాలపై కీలక చర్చలు జరిపారని సమాచారం. ఢిల్లీ వెళ్లే ముందు షర్మిల బెంగళూరులో 2 రోజులపాటు ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చర్చలు జరిపారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలతోనూ నేరుగా మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే షర్మిల వ్యూహం మార్చారు. కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. డీకే శివకుమార్ పుట్టినరోజున షర్మిల కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మరోసారి డీకేతో భేటీ అయ్యారు. అప్పటి నుంచే ఆమె హస్తంపార్టీకి దగ్గరవుతున్నారని తేలిపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఆ వార్తలను సున్నితంగానే ఖండించారు. కానీ ఇప్పుడు నేరుగా ఢిల్లీ పెద్దలనే కలవడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారం.
తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజలను, రైతులను కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్టీపీని గెలిపిస్తే రాజన్న రాజ్యం తెస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. ఆమె పాదయాత్రలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత షర్మిల పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు విధించారు. హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. కానీ తొలి విడతలో మాదిరిగా ఆమె మళ్లీ పాదయాత్రను కొనసాగించలేదు. కొన్నిరోజులుగా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ కార్యకలాపాలు చురగ్గా సాగడంలేదు.
షర్మిల పాదయాత్ర చేసినా పార్టీకి మైలేజ్ రాలేదు. పేరున్న నేతలెవరూ వైఎస్ఆర్టీపీలో చేరలేదు. ఆమె తర్వాత పార్టీలో బలమైన నేత ఒక్కరూ కూడా లేకపోవడం మైనస్ గా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ప్రభావం చూపించలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. షర్మిల కూడా తన పార్టీ బలంపై అంచనా వేసుకున్నట్లు ఉన్నారు. అందుకే కాంగ్రెస్ లో విలీనం వైపు అడుగులు వేస్తున్నారు.
షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఆమె మాత్రం వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. మరి షర్మిల తెలంగాణ నుంచి పోటీ చేస్తారా? ఏపీ బాధ్యతలు తీసుకుంటారా..? పార్టీ విలీనం ఎప్పుడు?