ఎండోమెంట్లోకి ఎర్రవరం ఆలయం.. వాట్ నెక్ట్స్? : సూర్యాపేట జిల్లా ఎర్రవరం బాల ఉగ్రనరసింహ క్షేత్రంలో దొంగ స్వాములు, అక్రమార్కులపై ప్రభుత్వం స్పందించింది. ఆలయాన్ని ప్రభుత్వం దేవదాయశాఖ పరిధిలోకి తీసుకుంది. సర్క్యులర్ కూడా జారీ చేసింది. అంతటితో కథ అయిపోయినట్టేనా? ప్రభుత్వం తదుపరి ఏం చేస్తుంది? ఆలయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
యర్రవరం ఉగ్రనరసింహ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి బాగా పెరుగుతోంది. యాదాద్రిని మించి ఇక్కడికి భక్తులు వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావడంతో ప్రజలు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకుంటే సరిపోదని సకల సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. యాదాద్రి తరహాలో డెవలప్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటి వరకు స్వామివారికి వచ్చిన కానుకలు, నగదు కొందరి జేబుళ్లోకి వెళ్లిపోయాయి. దుకాణాలు ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం అక్రమార్కులు స్వాహా చేశారు. అలా కాకుండా ఎండోమెంట్ పరిధిలోకి రాగానే పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.