Yellow Alert in Telangana: మిగ్జాం దెబ్బకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. కొన్ని చోట్ల ఈదురుగాలులకు చేట్లు నేలకూలాయి. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏపీలో కోస్తా తీరప్రాంత జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
కాగా.. మిగ్జాం తెలంగాణ జిల్లాల్లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న మిగ్జాం తుపాను కారణంగా.. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. వాటి ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డిలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మంగళవారం.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తుపాన్ కారణంగా గాలులు పెరగడంతో తెలంగాణలో చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.