Rain Alert for Hyderabad: వర్షాలకు సంబంధించి ఐఎండీ తాజాగా పలు సూచనలు చేసింది. హైదరాబాద్ లో ఏ క్షణంలోనైనా వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. ఆ సమయంలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశమున్నదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది. వీటితోపాటు తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో నగర వాసులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచనలు చేశారు సంబంధిత అధికారులు.
Also Read: అప్పుడు ఆయన బెదిరించాడు.. ఇప్పుడు ఈయన బెదిరిస్తున్నాడు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కాగా, గత నాలుగు రోజుల నుంచి కూడా తెలంగాణలో వర్షం కురుస్తూనే ఉంది. మంగళవారం కూడా హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. కామారెడ్డి, నిర్మల్, సిద్ధిపేట, నాగర్ కర్నూల్, మేడ్చల్, హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో కామారెడ్డిలోని గాంధారిలో అత్యధికంగా వర్షం కురిసింది. 97.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో కూడా భారీగా వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. పాటిగడ్డలో 40 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా రోడ్లపై వరద నీరు కనిపించింది. మోకాళ్ల లోతు వరకు రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు కనీసం రెండు అడుగులు ముందుకు కదలాలంటే అద్దగంటకు పైగా సమయం పట్టింది. ఒకవైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. నాలాలు వరద నీటితో నిండి పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం పెరిగింది.
Also Read: ట్రోలింగ్పై మళ్లీ స్పందించిన ఎంపీ రఘనందన్రావు.. ఈసారి ఏమన్నారంటే..?
ఈ క్రమంలో తాజాగా ఐఎండీ వర్షానికి సంబంధించిన సూచన చేసింది. రాష్ట్రంలో మరోసారి వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. నగరంలో కూడా భారీగా వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేసింది.