YCP COUNTER : ఎన్నికల వేళ సత్తుపల్లి వేదికగా సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పే ప్రయత్నంలో.. ఏపీ, తెలంగాణల మధ్య పరిస్థితులపై కేసీఆర్ వ్యాఖ్యానించారు . అప్పటి పాలకులు తెలంగాణ వస్తే చీకటిలో మగ్గాల్సి వస్తుందన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే ఏపీ చీకటిలో ఉందని కేసీఆర్ అన్నారు. అలాగే సింగిల్ రోడ్లు వస్తే అది ఏపీ ప్రాంతమని.. డబుల్ రోడ్లు వస్తే తెలంగాణ అని తెలిపారు. అక్కడి రైతులు ఇక్కడకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్న వ్యాఖ్యలతో రాజకీయ రగడ రాజుకుంది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుండటంతో మరోసారి ఏపీ తెలంగాణ సెంటిమెంట్గా డైలాగ్ వార్ నడుస్తోంది.
కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వర్రావు తీవ్రంగా మండిపడ్డారు . హైదరాబాద్లో వర్షం పడితే పిల్లలు నాలాల్లో కొట్టుకుపోతున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోసమే తెలంగాణ సెంటిమెంట్ను తీసుకువస్తున్నారని.. ఇది పాత ముచ్చటేనని కారుమూరి అన్నారు . జగన్ నాలుగేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని.. పేదరికాన్ని తగ్గించామని తెలిపారు. ఎన్నో మార్పులు తీసుకువచ్చి.. దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. అందుకే మళ్లీ జగన్ రావాలని కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో పండే సన్నబియ్యాన్నే తెలంగాణ వాళ్లు కొనుక్కుని తింటున్నారని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ధాన్యం అమ్మిన వారం రోజుల్లోనే రైతులకు డబ్బులిచ్చామని తెలిపారు.
ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిపారేశారు. విలీనమైన ఏడు మండలాల్లో సర్వే చేస్తే.. అక్కడి ప్రజలు ఏపీలో ఉండాలని పట్టు పడుతున్నారని.. అందుకు వైసీపీ సంక్షేమ పథకాలే కారణమని సజ్జల చెప్పుకొచ్చారు . ఎక్కడ ఏం చేశామో తమకు తెలుసని.. సమూలంగా మార్పులు తీసుకువచ్చే పథకాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామంటూ బదులిచ్చారు సజ్జల రామకృష్ణ.
2018లో కూడా సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. మళ్లీ ఇప్పుడు ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.అందుకు నిదర్శనం సత్తుపల్లిలో ఆయన చేసి వ్యాఖ్యలే. మరి 2018 ఎన్నికల ఫలితాలే పునరావృత్తం అవుతాయా లేదా అనేది తెలియాలంటే ఇంకో నెల రోజులు వేచి చూడాల్సిందే.