Woodoo Serial Killer | ఒక తాంత్రిక పూజారి సమాజంలో కొందరు అమాయకులను మూఢనమ్మకాలు, గుప్తనిధుల ఆశచూపి అత్యంత కిరాతకంగా 20 మందిని హత్య చేశాడు. అయితే అతడిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆ నరహంతకుడి గురించి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అతని గురించి వివరాలు వెల్లడించారు.
Woodoo Serial Killer | ఒక తాంత్రిక పూజారి సమాజంలో కొందరు అమాయకులను మూఢనమ్మకాలు, గుప్తనిధుల ఆశచూపి అత్యంత కిరాతకంగా 20 మందిని హత్య చేశాడు. అయితే అతడిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆ నరహంతకుడి గురించి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అతని గురించి వివరాలు వెల్లడించారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దాపూర్ గ్రామస్తుడైన రాపాటి సత్యనారాయణ యాదవ్ రియల్ స్టేట్ వ్యాపారం చేసుకునేవాడు. 2018 సంవత్సరంలో కౌన్సిలర్గా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తరువాత డబ్బు సంపాదించడానికి తాంత్రిక పూజారి అవతారం ఎత్తాడు. అతని తండ్రి, తాత ముత్తాతలు వంశపారంపర్యంగా పాము, తేలు కుడితే మంత్రాలు చేసేవారు. ఆ మంత్రాలు నేర్చుకొని సమాజంలో అమాయకులను టార్గెట్ చేశాడు. తన మంత్రశక్తులతో గుప్తనిధులు వెలికి తీస్తానంటూ నమ్మబలికేవాడు. వారివద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకొని పారిపోయేవాడు. డబ్బు లేకుంటే తనపేరు మీద ఆస్తులు రిజిస్టర్ చేయించుకునే వాడు. గుప్తనిధులు దొరికాక తన వాటా ఇస్తే అప్పుడు తిరిగి రిజిస్టర్ చేయిస్తానని చెప్పేవాడు.
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన వెంకటేశ్..హైదరాబాద్ నగరంలోని బొల్లారంలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. నవంబరు నెలలో వెంకటేశ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితుడు సత్యనారాయణకు మృతుడు వెంకటేశ్ పరిచయం ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో నాగర్ కర్నూల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నాగర్ కర్నూలు పోలీసులు రంగంలోకి దిగి వెంకటేశ్ హత్య కేసు విచారణ చేశారు. వెంకటేశ్ చనిపోక ముందు నిందితుడికి డబ్బులిచ్చినట్లు తేలింది. నిందితుడు ఆ డబ్బులు తీసుకొని క్షుద్రపూజలు చేసినట్లు పోలీసులకు తెలిసింది. ఈ ఆధారాలతో నిందితుడి అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. నిందితుడు ఇలాంటి హత్యలు ఎన్నో చేసినట్లు బయటపడింది.
అలా ఆగస్టు 14న 2020, వనపర్తి జిల్లా రెవల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో నిందితుడు తనకు పరిచయమైన ఓ వ్యక్తిని గుప్తనిధులు వెలికి తీస్తానంటూ నమ్మించి అతని ప్లాటు రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తరువాత పథకం ప్రకారం.. ఆ వ్యక్తి కుటుంబంలోని అందరికీ పూజ ప్రక్రియ పేరుతో పాలు తాగించాడు. ఆ పాలల్లో బంగారం కరిగించే రసాయనం కలిపాడు. దీంతో ఆ వ్యక్తి కుటుంబంలోని నలుగురు చనిపోయారు.
2022లో ఇలాగే నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని తీగలపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి, ఏపీ అనంతపురం జిల్లాలో నివసించే రాంరెడ్డి కూతురు హత్య చేయబడ్డారు. కర్ణాటకలోని రాయచూర్ సరిహద్దు ప్రాంతంలో వీరిద్దరినీ ఆ హంతకుడు బంగారం కరిగించే రసాయనాన్ని తాగించి హతమార్చాడు.
అమ్రాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో కల్వకుర్తి పట్టణానికి చెందిన వ్యక్తి కూడా ఇలాగే నిందితుడి చేతిలో చనిపోయాడు. నాగర్కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన లింగస్వామి అనే వ్యక్తి కూడా ఏడాదిన్నర క్రితం మండలంలోని చందుబట్ల గేట్ వద్ద నిందితుడు హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో ఇలాంటి కేసులే నమోదయ్యాయి. ఆ హత్యలు కూడా నిందితుడే చేసినట్లు రుజువైంది. మొత్తం 8 కేసులలో 11 మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యలతో పాటు ఒకే ప్లాటు ఇద్దరికి అమ్మినట్లు నిందితుడిపైన కేసు పెండింగ్ ఉందని పోలీసులు తెలిపారు. మరిన్ని హత్యల కేసులు పెండింగ్లో ఉన్నాయని.. కోర్టు అనుమతితో వాటిని కూడా ఛేదిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
నిందితుడు హత్యల కోసం ఉపయోగించిన పసరు ఆకులు, విష పదార్థాలు డిటోనేటర్స్, మృతి చెందిన వారికి సంబంధించిన ఐదు సెల్ ఫోన్లతో పాటు నిందితుడు ఉపయోగిస్తున్న మరో 8 సెల్ఫోన్లు, ఒక స్విఫ్ట్ కారు, నిందితుడి వద్ద నుంచి సీజ్ చేశారు.
ఇన్ని హత్యలు జరిగేంత వరకూ పోలీసులకు తెలియకపోవడం.. పోలీసుల వైఫల్యమని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నాగర్కర్నూల్ ప్రాంతంలో మూఢనమ్మకాలు విశ్వసించేవారు ఎక్కువగా ఉన్నారని.. అందుకే ఇలాంటి దొంగ మంత్రగాళ్ల ఆటగాళ్లు సాగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. పైగా నేరస్తులు పోలీసుల కంటే ఒక అడుగు ముందు ఉంటారని గద్వాల్ జోన్ డిఐజీ ఎస్ఎల్ చౌహాన్ చెప్పారు.