Hyderabad : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చట్నీ విషయంలో దంపతుల మధ్య తలెత్తిన గొడవ భార్య ఆత్మహత్యకు పాల్పడేల చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోపతండాకు చెందిన రమణ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(25) అనే యువతిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు. చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తుంది. ఈ దంపతులు ఇద్దరు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్లోని అపార్ట్మెంట్లో నివసముంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు.
సోమవారం ఉదయం అతడు విధులకు వెళ్లగా భార్య చాలా వీడియోకాల్స్ చేసింది. రమణ స్పందించకపోవడంతో ఫోన్ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ పెద్దగా కేకలు వేసింది. చనిపోతున్నానని చెప్పి చందన ఫోన్ పెట్టేసింది. అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా తన ఇంటికి వెళ్లి చూడాలనికోరాడు. యజమాని ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చూడగా అప్పటికే ఆమె విగతజీవిగా పడి ఉంది. రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కేసు నమోదు చేసుకుంటామని తెలిపారు.