తెలంగాణలో చలి చంపేస్తోంది. మరో మూడు రోజులు తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. ఈ సీజన్లో ఇదే అత్యల్ప టెంపరేచర్గా చెప్తున్నారు. సాధారణంగా అడవుల జిల్లా ఆదిలాబాద్లో అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఆ రికార్డును రంగారెడ్డి జిల్లా బ్రేక్ చేస్తోంది. షాబాద్ ఒక్కటే కాదు.. మొన్న హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
రాత్రి పూట చలి సాధారణంగా ఉన్నప్పటికీ.. తెల్లవారుజామున వెన్నులోంచి వణుకు పుట్టిస్తోంది. తెలంగాణలో మరో మూడు రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో.. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లేవారు కాస్త ఆలస్యంగా వెళ్తే మంచిదని చెప్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోయాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. త్రిపురలోను రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయిలకు పడిపోతాయని అప్రమత్తం చేసింది. 17వ తేదీ వరకు వాతావరణం ఇలాగే ఉండనుంది.
ఇక, ఢిల్లీ పూర్తిగా చలి గుప్పిట్లో చిక్కుకుపోయింది. విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. వంద మీటర్ల దూరంలో ఏముందో కూడా కనిపించనంతగా దేశ రాజధానిలో మంచు కురుస్తోంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు జీరోని సమీపిస్తున్నాయి. ఐదు డిగ్రీల సెల్సియస్కు పడిపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.