Komatireddy Rajgopal Reddy : అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చాలా మంది నేతలు జంపింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టిక్కెట్ దక్కని నేతలు ఆఫర్ ఇచ్చిన పార్టీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు నేతల వలసలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మరోవైపు రాజగోపాల్రెడ్డి ఈ అంశంపై స్పందించారు. కాంగ్రెస్లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి ఉందని వివరించారు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టతనిస్తానన్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తుల్లో మునుగోడు నుంచి సీపీఐ బరిలో ఉంటే తాను పోటీ చేస్తానని రాజగోపాల్రెడ్డి బీజేపీ అధిష్ఠానానికి చెప్పారని తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ పోటీ ఉంటే మాత్రం తనకు ఎల్బీ నగర్ టిక్కెట్ ఇవ్వాలని కోరారని సమాచారం. అలాగే మునుగోడులో తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని కోరారని తెలుస్తోంది.
మునుగోడు నుంచే బరిలో ఉండాలని రాజగోపాల్రెడ్డికి బీజేపీ అధిష్టానం స్పష్టం చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో పోటీ నిర్ణయంపై తనకు కొంత సమయం కావాలని రాజగోపాల్ రెడ్డి కోరారని అంటున్నారు. అందువల్లే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో రాజగోపాల్రెడ్డి పేరును ప్రకటించలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. మరి రాజగోపాల్ రెడ్డి తిరిగి హస్తంగూటికి చేరాతారా? బీజేపీలో ఉంటారా? ఆయన దారెటు?