Hydra next target: హైడ్రా పేరు వినగానే కొందరు సెలబ్రిటీలు ఉలిక్కిపడుతున్నారు. లేక్ల సమీపంలో ఇంటిని ఏర్పాటు చేసుకున్నవారికి టెన్షన్ మొదలైంది. ఎప్పుడు అధికారులు నోటీసులు ఇస్తారేమోనన్న భయంతో వణుకుతున్నారు. తాజాగా శనివారం ఉదయం నటుడు నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. దీంతో కబ్జాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, లేక్లు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన నిర్మాణాలను కూల్చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఇల్లు కూడా తెరపైకి వచ్చింది.
జూబ్లీహిల్స్లోని లోటస్పాండ్ వద్ద జగన్ ఇల్లు చెరువును ఆనుకొని నిర్మించారు. చాలావరకు చెరువును కబ్జా చేసి ఇంటిని నిర్మించారన్న వార్తలు లేకపోలేదు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం హైడ్రా అధికారులు దాన్ని కూడా కూల్చేస్తారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ALSO READ: కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి.. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఉమ్మడి ఏపీలో లోటస్పాండ్ను నిర్మించారు. ఒకవైపు ఇల్లు, మరోవైపు పార్టీ ఆఫీసుగా దీన్ని జగన్ ఉపయోగించేవారు. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి మకాం మార్చేశారు వైసీపీ అధినేత. తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చేశారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టడం మానేశారు.
జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో లోటస్పాండ్ ఇంటి గురించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. సీబీఐ అధికారులు.. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇంటికి సంబంధించిన డీటేల్స్ బయటపెట్టారు. 2006-07 మధ్యకాలంలో ఆరు ఇండివిడ్యువల్ ప్లాట్లను అప్పట్లో 24 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తేలింది.
2007లో లోటస్ మహల్ను నిర్మాణం మొదలైంది. దాదాపు 5,807 చదరపు గజాల (52,263 చదరపు అడుగులు) విస్తీర్ణంలో నిర్మించారు. నిర్మాణం సమయంలో కొంత భూమిని కబ్జా చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 30 బెడ్రూమ్లతో కూడిన భారీ అతిథి గృహం, 20 సర్వెంట్ క్వార్టర్లు, వెనుక భాగంలో డబుల్- స్టోరీ అవుట్హౌస్ ఉన్నాయి.
ఒక్కసారి వెనక్కి వెళ్తే.. ఈ ఏడాది జూన్ చివర్లో లోటస్పాండ్లోని జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ కోసం ఏర్పాటు షెడ్ను ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణమంటూ గుర్తించిన అధికారులు.. ఆ షెడ్ను కూల్చివేశారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ అధికారిపై వేటు పడింది కూడా.
చాలామంది కాంగ్రెస్ నేతలు చెరువులు, లేక్లను కబ్జాలు చేసి ఇళ్లు నిర్మించారని బీఆర్ఎస్ ఆరోపించింది. రెండురోజులుగా ఈ పంచాయితీ జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చారు. బఫర్ జోన్లో నా ఫాంహౌస్ వున్నట్లు తేలినా మొత్తాన్ని కూల్చివేయాలని మీడియా ముందు చెప్పుకొచ్చారు. తాను ఇక్కడి నుంచే అధికారులను ఆదేశించారు. మంచి ఉద్దేశంతో హైడ్రాను తీసుకొచ్చామని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. మొత్తానికి హైడ్రా వ్యవహారం రాజకీయ, సినీ సెలబ్రిటీల్లో గుబులు లేపుతోంది.