BRS Party: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం. కవిత బెయిల్ కోసం ఢిల్లీలో కేటీఆర్, హరీష్ చక్కర్లు కొడుతుండడంతో బీజేపీతో మంతనాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన, పార్టీ విలీనంపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో చీకటి ఒప్పందం ఉంటే ఇన్ని రోజులు కవిత జైల్లో ఉండేదా? అని అన్నారు. కవిత బెయిల్ కోసం ఢిల్లీ వెళ్తుంటే, బీజేపీతో చీకటి ఒప్పందాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాం, 4 ఏళ్ల తరువాత అధికారంలోకి వస్తామని తెలిపారు.
వారికి అనర్హత వేటు తప్పదు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలోనే అనర్హత వేటు పడుతుందన్నారు కేటీఆర్. తప్పకుండా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని, ప్రభుత్వ పెద్దల కుట్రలు అన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో తప్పకుండా ఉప ఎన్నిక రాబోతోందని, అప్పుడు తాటికొండ రాజయ్య గెలవడం ఖాయమని చెప్పారు. తమ పార్టీ నుండి గెలిచి, ఇతర పార్టీలోకి వెళ్లి ఎంపీగా పోటీ చేసిన నేతపై అనర్హత వేటు పడుతుందన్న కేటీఆర్, హైకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉందన్నారు. స్పీకర్ పక్షపాత వైఖరి చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కనుసన్నల్లో బీజేపీ పనిచేస్తోందన్నారు కేటీఆర్. కేంద్రం నుండి ఒక్క రూపాయి మనకు రాలేదని, కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం వల్ల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదని, చిల్లర మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు. అసెంబ్లీలో సబితను తిట్టారని, రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని, అందుకే తన కుటుంబ సభ్యుల కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్లు డ్రామా క్రియేట్ చేశారని అన్నారు. రాష్ట్రానికి ఒక్క కంపెనీ తీసుకురాలేదని ఆరోపించారు.
Also Read: Mahesh Babu Family Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో మహేష్ బాబు ఫ్యామిలీ..
నాలుగేళ్ల తర్వాత మాదే అధికారం
నాలుగేళ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తరువాత 25 ఏళ్ల పాటు అధికారంలోనే ఉంటామని చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పెద్ద ఓటమే కాదన్న ఆయన, కొద్ది తేడాతోనే 14 సీట్లలో ఓడిపోయామని వివరించారు. శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కథ వేరే ఉండేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కరెంట్ మాయం అయిందని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. రుణమాఫీపై రేవంత్ రెడ్డి మాట తప్పారని, రాష్ట్రంలో రైతులు తిరగబడుతారని రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడం లేదన్నారు కేటీఆర్.