CM Revanth Reddy Speech: తెలంగాణలో మరో కొత్త నగరం నిర్మాణం కాబోతున్నది. ఆ విషయాలను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో స్కిల్ యూనివర్సిటీకి శంఖుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నగరాన్ని నిర్మించబోతున్నట్లు ఆయన తెలిపారు. గత పాలకులు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ను నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బెగరికంచను నాలుగో సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని హెల్త్, స్పోర్ట్స్, ఇతర కంపెనీలకు హబ్ గా డెవలెప్ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో రూ. 150 కోట్లతో స్కిల్ యూనివర్సిటీని నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పారు. అయితే, ఈ ప్రాంత అభివృద్ధి కోసం విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చారంటూ అభినందించారు. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని నిర్మించి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందజేస్తామన్నారు. రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, ఉద్యోగం కల్పించే బాధ్యతను తీసుకుంటామంటూ సీఎం హామీ ఇచ్చారు.
Also Read: స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమన్నారు. అందువల్ల పట్టభద్రులైన వారిని ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని, దీంతో రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.