– హైదరాబాద్లో కొనసాగుతున్న హైడ్రా యాక్షన్
– రాజేంద్రనగర్ సర్కిల్లో కూల్చివేతలు
– అప్పా చెరువు, మామిడి చెరువు ఆక్రమణల తొలగింపు
– పటాన్ చెరు ఏరియాలో పర్యటించిన కమిషనర్ రంగనాథ్
– అక్రమ నిర్మాణాలపై అధికారులతో చర్చ
– సాకి చెరువులో 18 అక్రమ నిర్మాణాల గుర్తింపు
– ఏకంగా చెరువు తూమును పూడ్చిన ఇన్కోర్ సంస్థ
– చెరువుల్లో కట్టుకుని కోర్టుకెళ్తే ఊరుకోమన్న రంగనాథ్
– నోటీసులు ఉండవు.. అక్రమమైతే కూల్చివేయడమేనని స్పష్టం
– మియాపూర్లో చెరువులు ఆక్రమించి భారీ భవంతుల నిర్మాణం
– పలువురు బిల్డర్స్పై కేసుల నమోదు
Illegal Encroachments: అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ ప్లాన్ కొనసాగుతోంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి కట్టిన భవనాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు అధికారులు. శనివారం రాజేంద్రనగర్ సర్కిల్లో కూల్చివేతలు కొనసాగాయి. గగన్ పహాడ్లోని అప్పా చెరువు, మామిడి చెరువు పరిధిలో ఆక్రమణలను తొలగించారు. బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి చెరువు భూమి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు 13 భారీ కట్టడాలను నేలమట్టం చేశారు. ఓవైపు వర్షం కురుస్తున్నా, తగ్గేదే లేదన్నట్టుగా అక్రమ నిర్మాణాలను తొలగించారు. చెరువు ఏరియాలను ఆక్రమించిన కొందరు వ్యాపార నిర్మాణాలు చేపట్టారు. ఇంకొందరు పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు.
రంగనాథ్ సుడిగాలి పర్యటన
పటాన్ చెరులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. సాకి చెరువుని పరిశీలించారు. కబ్జాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించారు. సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా పదుల ఎకరాల్లో కబ్జాకి గురైనట్టు అనుమానిస్తున్నారు. చెరువుని ఆనుకునే తూములు బంద్ చేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టినట్టు చెబుతున్నారు. ఈ నిర్మాణాలను పరిశీలించారు రంగనాథ్.
Also Read: Hyderabad Rains: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్, కాలేజీలకు రెండు రోజులు సెలవు
నోటీసులు ఉండవన్న రంగనాథ్
రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పర్యటించిన రంగనాథ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఏరియాలను పరిశీలించారు. సాకి చెరువులో 18 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్టు చెప్పారు. ఇన్కోర్ సంస్థ చెరువు తూమును పూర్తిగా పూడ్చేసిందని, తర్వాత అపార్ట్మెంట్లు కట్టిందని తమకు ఫిర్యాదు అందినట్టు పేర్కొన్నారు. చెరువుల్లో కట్టి కోర్టుకెళ్తామంటే కుదరదన్న ఆయన, హైడ్రా నుంచి నోటీసులు ఉండవని, అక్రమమైతే కూల్చివేస్తుందని స్పష్టం చేశారు. స్టేలు తెచ్చుకునే టైమ్ ఇవ్వమని, రెండు గంటల్లోనే కూల్చేస్తామని హెచ్చరించారు. మరోవైపు, లోటస్ పాండ్ పరిధిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చామన్న వార్తలను ఖండించారు రంగనాథ్. జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు సైతం తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు.
మియాపూర్లో కేసులు
మియాపూర్ పరిధిలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారుల కొరడా ఝులిపించారు. చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టిన బిల్డర్పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డిపై కేసు పెట్టారు. అతనితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు అధికారులు. హైడ్రా సిఫార్సు మేరకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఎర్రగుంట చెరువులో ఆక్రమణలు చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించింది మ్యాప్స్ సంస్థ. అలాగే, ఈర్ల చెరువులో భవనాలు నిర్మించిన బిల్డర్స్ స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులు, కృష్ణ కిశోర్లపై కేసు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు.