Polygamy: నా భర్త పరాయి స్త్రీ వంక కన్నెత్తి చూడొద్దని సాధారణంగా భార్య అనుకుంటుంది. తన భర్తకు తానే లోకం కావాలనే తపన కూడా వారిలో ఉంటుంది. కానీ, ఈ సతీమణి మాత్రం తన భర్తకు దగ్గరుండి మరీ మరో యువతితో పెళ్లి జరిపించింది. మహబూబాబాద్ జిల్లాలో ఈ పెళ్లి జరిగింది. భార్యే.. తన భర్తకు మరో యువతితో పెళ్లి జరిపించాల్సిన పరిస్థితి ఏం వచ్చింది?
మహబూబాబాద్ జిల్లాలో సురేష్, సరిత దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు, కూతురు ఉన్నారు. వీరిద్దరి మధ్య పెద్దగా ఘర్షణలేమీ లేవు. కోపతాపాలూ, పగ, ద్వేషమేమీ లేవు. కానీ, అన్యోన్యంగా సాగుతున్న ఈ జంట అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. బంధు మిత్రుల సమక్షంలో మార్కండేయ దేవస్థానంలో వివాహం జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి.. సురేష్కు మేనమామ ఉన్నాడు. మేనమామకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లి జరిగిపోయింది. చిన్న కూతురు సంధ్య మానసిక వికలాంగురాలు. ఆమెకు పెళ్లి కాలేదు. సంధ్య పెళ్లి గురించి తల్లిదండ్రులు మదనపడ్డారు. తమ తదనంతరం బిడ్డ భవిష్యత్ ఏమిటా? అనే బెంగా వారిని వెంటాడింది. అసలే సంధ్య మానసిక వికలాంగురాలు.. తనను తానే మేనేజ్ చేసుకోలేని పరిస్థితి. సంధ్య గురించి తెలిసిన, ఆమె పరిస్థితి అర్థం చేసుకోగలిగినవారికే ఆమెతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. బంధువులూ అనుకున్నారు. మేనల్లుడు అయిన సురేష్, సరిత దంపతుల ముందు ఈ ప్రతిపాదన పెట్టారు.
సరితకు కూడా సంధ్య గురించి తెలుసు. సంధ్యను ఆమె చెల్లిగానే చూస్తూ వస్తున్నది. ఆమె భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని పెద్దలు తీసుకున్న నిర్ణయానికి సమ్మతం తెలిపింది. సంధ్య కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అందరి సమక్షంలోనే అందరి సమ్మతంతోనే సురేష్, సంధ్యల పెళ్లి జరిగిందని వివరిస్తున్నారు.
భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేసిన భార్య…
తన భర్తను మానసిక వికలాంగురాలైన ఓ యువతి ఇష్ట పడడంతో ఓ భార్య తన భర్తకు దగ్గరుండి ఆ యువతితో వివాహం జరిపించింది.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన సురేష్, సరితలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ఓ కుమారుడు, కూతురు ఉండగా ఆమె… pic.twitter.com/cOx7f1vPmr
— BIG TV Breaking News (@bigtvtelugu) August 28, 2024
సురేష్ మొదటి భార్య సరిత మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య తనకు చెల్లి వంటిదని, ఆమె బాగోగులు చూసుకోవడానికే ఈ పెళ్లికి అంగీకరించానని వివరించింది. సంధ్య మానసిక వికలాంగురాలని, ఆమె బాగోగుల కోసమే ఈ పెళ్లి జరిపించామని స్పష్టం చేసింది. అందుకు కాక.. ఇంకెందుకు పెళ్లి చేస్తామని సరిత ఎదురు ప్రశ్నించింది. ఈ పెళ్లి అందరి ఇష్టపూర్వకంగా జరిగిందని తెలిపింది.
ఇలాంటి ఘటనలు జరగడం అరుదుల్లోకెల్లా అరుదు. సంతానలేమీ వంటి బలమైన కారణాలు మినహా ఇలాంటి పెళ్లికి దంపతులు అంగీకరించరు. ఇక్కడ వీరంతా మానసిక వికలాంగురాలైన సంధ్య భవిష్యత్ గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాహం పట్ల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.