Navya : స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మధ్య వేధింపుల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్యేతోపాటు తన భర్త ప్రవీణ్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్లపై నవ్య ధర్మసాగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టపరంగా వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఉన్నాయని స్పష్టం చేశారు.
వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య.. గ్రామ అభివృద్ధికి 25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైసా ఇవ్వలేదని నవ్య అన్నారు. కానీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పు తీసుకున్నట్లు బాండ్ పేపర్పై సంతకం పెట్టాలని ఎమ్మెల్యేతోపాటు తన భర్త కూడా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు.
తన భర్త ప్రవీణ్ను ఎమ్మెల్యే ట్రాప్ చేశారని నవ్య ఆరోపిస్తున్నారు. నిధులిస్తామంటేనే గతంలో రాజీపడ్డామని అన్నారు. గతంలో మీడియా సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వకలేదన్నారు.
నెలరోజుల క్రితం తన భర్త ప్రవీణ్, ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాస్ తనను హన్మకొండకు రప్పించారని నవ్య తెలిపారు. అక్కడ తాను చేసిన ఆరోపణలన్నీ తప్పని, తనకు అప్పుగా కొంత డబ్బు ఇచ్చినట్లు స్టాంప్ పేపర్లపై సంతకం పెట్టాలంటూ బలవంతం చేశారని ఆరోపించారు. సంతకం పెడితేనే గ్రామానికి 25 లక్షల నిధులు మంజూరు చేస్తామని కండీషన్లు పెట్టారని తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన సర్పంచ్ నవ్య భర్త తాను వ్యవహరించిన తీరు తప్పుని ఒప్పుకున్నాడు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్న సమయంలో పక్కన లేకపోవడం ఏంటనే నవ్య ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నానన్నారు ప్రవీణ్. తన వల్ల పొరపాటు జరిగిందని ఇప్పుడ నవ్యకు సపోర్ట్ చేయడమనేది తన బాధ్యత అంటున్నారు. నవ్య తీసుకున్న ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని చెబుతున్నాడు.
సర్పంచ్ నవ్య ఫిర్యాదును స్వీకరించిన ధర్మసాగర్ పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాత చర్యలు చేపడతామని సీఐ రమేశ్ తెలిపారు. నవ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.