FarmHouse Case: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సర్కారుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. హైకోర్టు సింగిల్ జడ్జి కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. తాము సిట్ ఏర్పాటు చేసి.. పక్కాగా విచారణ చేస్తుంటే.. మధ్యలో సీబీఐ వస్తే ఎలా? అనేది సర్కారు భావన. అందుకే, సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లింది ప్రభుత్వం. అక్కడా సీబీఐకే కేసును ఇచ్చింది. కనీసం సుప్రీంకోర్టకు వెళ్లే వరకైనా సీబీఐని ఆపండంటూ వేడుకుంది. ఈలోగా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా కేసు టేకప్ చేయాలని రిక్వెస్ట్ చేసింది.
ఎందుకు? ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ ప్రభుత్వం ఇంతలా ఎందుకు టెన్షన్ పడుతోందనే ప్రశ్న వస్తోంది. ఈ కేసులో సిట్ పక్కా ఆధారాలు సేకరించిందని.. ఈ సమయంలో కేసు సీబీఐకి అప్పగిస్తే విచారణ పక్కదారి పట్టే అవకాశం ఉందంటూ ప్రభుత్వం తరఫు సీనియర్ లాయర్ సుప్రీంలో ప్రస్తావించారు. ఆయన మాటలను బట్టి.. ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐ నీరుగారుస్తుందనేనా భయం?
సిట్ దర్యాప్తు పకడ్బందీగా సాగింది. ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నే టార్గెట్ చేసింది. నోటీసులు ఇచ్చి బీజేపీ పెద్దలు ఉలిక్కిపడేలా చేసింది. ఎక్కడో కేరళలో ఉండే తుషార్ ను, జగ్గుస్వామిని సైతం సిట్ ముందుకు రప్పించేందుకు గట్టి ప్రయత్నమే చేసింది. సిట్ దూకుడు అలానే కొనసాగితే.. బీజేపీ పెద్దలు ఈ కేసులో ఇరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఆ సమయంలో.. విచారణ కీలక దశలో ఉండగా.. కేసు అనూహ్యంగా సీబీఐకి వెళ్లడాన్ని సర్కారు తట్టుకోలేకపోతోందని అంటున్నారు.
స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని అంటారేగానీ.. వాస్తవంలో సీబీఐపై కేంద్ర ప్రభుత్వ ప్రభావం బలంగా ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోల్లో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ బిగ్ పిన్ బీఎల్ సంతోష్ ల పేర్లు వినిపించడం.. ఆ స్థాయి నేతలు ఉండగా.. సీబీఐ విచారణ ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిందే.
మరోవైపు, ఇప్పటికే ఫాంహౌజ్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. డబ్బుల లెక్కలపై ఆరా తీసింది. ఒకవేళ కేసు సీబీఐకి వెళితే.. మధ్యవర్తుల నుంచి డబ్బులు తీసుకునేలా డీల్ కుదుర్చుకున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు సైతం కేసులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. డబ్బులు ఇవ్వడం.. తీసుకోవడం.. రెండూ పెద్ద నేరాలేనని సీబీఐ ఆ యాంగిల్ లో కేసు బిగిస్తే.. అది బీఆర్ఎస్ కే కష్టం.
అందుకే, ఎట్టిపరిస్థితుల్లోనూ కేసు సీబీఐకి వెళ్లకుండా.. సర్కారు తనవంతు ప్రయత్నం గట్టిగా చేస్తోంది. కోర్టుల మీద కోర్టులు మారుస్తూ.. దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు నిలుచుంది. మరి, అక్కడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభిస్తుందా? కేసు సీబీఐకి వెళ్లకుండా అడ్డుకోగలుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.