kavitha: కవిత తప్పే చేసి ఉండొచ్చు. ఆమెకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలే ఉండొచ్చు. రామచంద్ర పిళ్లై.. కవిత బినామీనే కావొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెది కీ రోలే అవ్వొచ్చు. అయితేనేం. ఇప్పటికే ఓసారి సీబీఐ ప్రశ్నించింది. ఈడీ కూడా ఎంక్వైరీ చేయాలని భావించింది. చేయొచ్చు. అందులో తప్పేం లేదు. ఆధారాలుంటే అరెస్ట్ కూడా చేసుకోవచ్చు. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే. కానీ, ఆ పని చేసే విధానం ఉందే.. అది విమర్శల పాలు కాకుండా చూసుకుంటే మంచిది అంటున్నారు. మహిళా దినోత్సవం రోజునే.. ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ పొలిటికల్ రంగు కూడా పులుముకుంటోంది.
దేశమంతా గ్రాండ్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. మహిళలను కీర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. సత్కరిస్తున్నారు. ఇలాంటి ఉమెన్స్ స్పెషల్ రోజునే.. ఓ మహిళకు ఈడీ నోటీసులు ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్? ఆ నోటీస్ ఏదో మర్నాడు ఇవ్వలేరా? లేదంటే, ముందురోజే ఇచ్చి ఉండాల్సిందిగా? సరిగ్గా.. ముహూర్తం చూసి ఇచ్చినట్టు.. మహిళా దినోత్సవం రోజునే కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తీవ్ర విమర్శల పాలవుతోంది. కవిత కేసు గురించి దేశమంతా చర్చ జరగాలనే ఉద్దేశంతోనే.. కావాలనే ఉమెన్స్ డే న ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ వ్యూహం, ఒత్తిడి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఉమెన్స్ డే నాడే నోటీసులు జారీ చేసి మొత్తం మహిళా జాతిని ఈడీ కించపరిచిందని.. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఇలా జరుగుతోందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్త ఆరోపించారు. నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం లేదని.. కానీ ఎంచుకున్న తేదీ, సందర్భంపైనే తమకు అభ్యంతరం ఉందని.. కోర్టుల్లో విచారణ తర్వాత నిజమేంటో తెలుస్తుందని అన్నారు. మహిళా దినోత్సవం రోజున నోటీసులు జారీ చేయడం బెదిరించే ప్రయత్నమేనని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చింది కాదు. కొన్నాళ్లుగా జరుగుతోంది విచారణ. కవిత పేరు రిమాండ్ రిపోర్టులో ఉంది. అలాంటిది హడావుడిగా.. ఆమె ఢిల్లీలో దీక్ష చేయనున్న ముందురోజే విచారణకు రమ్మంటూ నోటీసులు ఇవ్వడం టార్గెట్ చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. దీక్ష షెడ్యూల్ను కవత వారం రోజుల ముందే ప్రకటించారని.. అయినా కావాలనే దీక్షను డిస్టర్బ్ చేయాలనే.. రాజకీయ ఒత్తిడితో ఈడీ నోటీసులు ఇచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమెన్స్ డే రోజున కవితకు నోటీసులు ఇచ్చి.. ఈడీ బాగా బ్లేమ్ అయిందని అంటున్నారు. అయితే, ఈ డ్యామేజ్ను కవర్ చేసేందుకు కమలనాథులు రంగంలోకి దిగారు. లిక్కర్ స్కాంలో కవిత ఉండటం.. మహిళా సమాజానికి సిగ్గుచేటంటూ విమర్శలు చేస్తున్నారు.